శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (18:18 IST)

బుడమేరు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపండి : బాబుకు షర్మిల వినతి

ys sharmila
భవిష్యత్‌లో విజయవాడ నగరం నీట మునిగిపోకుండా ఉండేందుకు వీలుగా బుడమేరులోని ఆక్రమణలను తొలగించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుడమేరును ఆక్రమించుకుని భవంతులు నిర్మించుకున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
గురువారం వరద బాధిత ప్రాంతమైన విజయవాడలోని అజిత్ సింగ్‌ నగర్‌ ప్రాంతంలో ఆమె పర్యటించి, వరద బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమన్నారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో హైడ్రా తరహాలో బుడమేరు ఆక్రమణలు తొలగించాలని సూచించారు.
 
'కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయింది. విజయవాడ వరదలకు బుడమేరే కారణం. వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలి. ఈ ప్రమాదం రాకుండా చూడాల్సిన భాధ్యత ప్రస్తుతం చంద్రబాబు మీదే ఉంది. బుడమేరుకి రిటర్నింగ్ వాల్ కట్టాలి. వరదల్లో ఇప్పటివరకు 35 మంది చనిపోయారు. 5 లక్షల మంది నష్టపోయారు. ఇది ఘోర విపత్తు. ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే ప్రధాని నరేంద్ర మోడీ కనీసం స్పందించలేదు. 
 
విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదు. ఇక్కడి ఎంపీల మద్దతుతో ప్రధాని అయ్యాననే సంగతి మరిచారు. ఏపీ ప్రజల కష్టాలు మోడీకి కనిపించడంలేదు. వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించాలి. నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం రూ.లక్ష సాయం చేయాలి' అని షర్మిల డిమాండ్‌ చేశారు.