బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:10 IST)

వాలంటీర్లకు అవార్డులు.. రూ.241 కోట్ల ఖర్చు.. ఏపీ సీఎం జగన్ ప్రశంసలు

AP CM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న 2.67 లక్షల మంది వాలంటీర్లలో 2.25 లక్షల మందికి ఈసారి ఉగాది పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇందులో సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర అనే మూడు విభాగాల్లో వారికి అవార్డులు ఇస్తున్నారు. లెవల్‌-1లో సేవామిత్ర అవార్డు కింద 2.18 లక్షల మందికి సత్కారంతో పాటు10 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ ఇస్తున్నారు. 
 
ఇందుకోసం ప్రభుత్వం 241 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఇకపై ప్రతీ సంవత్సరం ఈ పురస్కారాలు కొనసాగుతాయన్నారు. నేటి నుంచి ప్రతీ జిల్లాలో రోజుకో నియోజకవర్గంలో వాలంటీర్లకు ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు.
 
పేదరికం అంటే తెలిసిన వారు, పేదల బాధలు అర్దం చేసుకున్న వారే వాలంటీర్లని సీఎం జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. పేదల బాధలు అర్దం చేసుకున్నవారే పేదలకు అలాంటి బాధ రాకుండా చూసే సైనికులు అవుతారని జగన్‌ తెలిపారు. 
 
రూపాయి లంచం ఆశించకుండా పెన్షన్‌ అందిస్తున్న గొప్ప సైనికులు వాలంటీర్లన్నారు. 32 రకాల సేవల్ని వాలంటీర్లు అందిస్తున్నారని, కోవిడ్‌ను నియంత్రించే విషయంలో వాలంటీర్ల పాత్ర గొప్పదన్నారు. వాలంటీర్ల సేవల్ని ప్రజలు గుర్తించారని, ప్రభుత్వం కూడా గుర్తించాలని భావించాం, అందుకే అవార్డులు ఇస్తున్నట్లు జగన్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిలాల్లో వాలంటీర్లు పించన్ దారులు మరో చోట ఉన్న సరే అక్కడికి వెళ్లి పెన్షన్లు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్‌ సోదాహరణంగా గుర్తు చేశారు. 
 
క్రమశిక్షణతో మెలిగినంతకాలం ఎలాంటి విమర్శలకూ వెరవొద్దని జగన్‌ వాలంటీర్లకు సూచించారు. పండ్లు పండే చెట్లు మీదే రాళ్లు పడతాయని, వారి పాపానికి వారినే వదిలేయమని సూచించారు. వారి ఖర్మకు వదిలేయమన్నారు. ప్రభుత్వం మాత్రం వాలంటీర్లకు తోడుగా ఉంటుందన్నారు. మీరు చేస్తుంది ఉద్యోగం కాదు సేవ, మీరు చేస్తున్న సేవకు వచ్చే దీవెనలే మీకు ముఖ్యమన్నారు. అవార్డులు అందుకుంటున్న వాలంటీర్లకు సీఎం జగన్ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.