1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (15:11 IST)

పిచ్చి ముదురుతోంది.. ఇక గొలుసులతో కట్టేయాల్సిందే: విజయసాయిరెడ్డి

రాష్ట్రంలో పలువురు రాజకీయ నేతలకు పిచ్చి ముదురుతోందని, అలాంటివారిని గుర్తించి గొలుసులతో కట్టివేయాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని ఆదివారం విమర్శలు గుప్పించారు. 
 
వైజాగ్ గ్యాస్ లీకేజీ అంశంపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, 'స్టిరిన్ గ్యాస్ అంటే ఏమిటో జ్ఞానినైన తనకే అంతుబట్టడంలేదని, ఇక ఈ ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుందని అంటున్నాడు. బాధితులకు చికిత్స కోసం బయటి నుంచి నిపుణులను రప్పించాలట. మొన్న కూడా ఇంతే, కరోనా వైరస్ కు చికిత్స చేయడానికి ఇక్కడి డాక్టర్లకేం తెలుసని పేలాడు. చూస్తుంటే పరిస్థితి అదుపుతప్పుతున్నట్టు కనిపిస్తోంది... ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 
 
మరోవైపు, ఏపీలో కరోనా వైరస్ కష్టకాలంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ అదనపు జేసీల నియామకం కోసం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు ఒక్కో జాయింట్‌ కలెక్టర్ చొప్పున నియమించింది. సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు అదనపు జాయింట్‌ కలెక్టర్‌ను నిమామకం చేసింది.