1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (18:51 IST)

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జాతికి క్ష‌మాప‌ణ చెప్పాలి

పంజాబ్  పర్యటనలో  ప్రధానిపై అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు  నేత్రుత్వంలో బిజెపి ప్రతినిధి బృందం భేటీ అయింది. జాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో వ్యవహరించిన తీరును రాష్ట్రపతి ద్రుష్టికి తీసుకు వెళ్లాలని గవర్నర్ కు విన్నవించారు.
 
 
ప్రధానిమోడీ కి కల్పించాల్సిన భ‌ద్ర‌త‌లో పంజాబ్ ప్రభుత్వం విఫలమైన తీరు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై గవర్నర్ కు వివరించారు. అనంతరం  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ ను కలసిన తరువాత గవర్నర్ బంగ్లా వద్దనే కొద్దిసేపు మీడియా తో మాట్లాడారు. పంజాబ్ లో ప్రధాని పర్యటన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. 
 
 
దేశ సరిహద్దుకు పది కిలోమీటర్లు దూరంలో పాకిస్తాన్ కు దగ్గరలో ఉన్న ప్రాంతం లో ప్రధాని భద్రతను ప్రమాదంలో పడవేసే విధంగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని సోము వీర్రాజు తీవ్ర స్వరంతో అన్నారు. అటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందన్నారు. ఈ విషయం అత్యంత దారుణమన్నారు. ప్రధాని లాంటి పెద్దలకు బ్రిడ్జిలు వచ్చినప్పుడు భ‌ద్ర‌త మరింత కట్టుదిట్టం చేయాలి కాని, పై స్ధాయి అధికారి ఎవరూ లేరు అంటే అక్కడి ప్రభుత్వం ప్రధాని పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేదన్న విషయం స్పష్టంగా కనపడుతోంద‌న్నారు.
 
 
అందువల్లే సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.  
పంజాబ్ ముఖ్యమంత్రి  చేసింది అంతా చేసి, ఈ సంఘటన రాజకీయం చేయాలని చూడడం దారుణమన్నారు. ప్రధాని మోడీ పర్యటనలో భ‌ద్ర‌త వైఫల్యంపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. ఈనెల 13 వరకు బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  సోమువీర్రాజు ప్రకటించారు. గవర్నర్ ను కలసిన వారిలో  బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నాలక్ష్మీనారాయణ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బిట్ర వెంకట శివన్నారాయణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ. బిజెపి జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం తదితరులు ఉన్నారు.