ర్యాంకులు మంత్రులను తక్కువ చేసేందుకు కాదు : సీఎం చంద్రబాబు
మంత్రులను పనితీరు ఆధారంగా కేటాయించిన ర్యాంకులు ఏ ఒక్కరినీ తక్కువ చేసేందుకు కాదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే మంత్రులుగా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో గత తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనలో మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు.
ఇందులో మొదటి స్థానాన్ని మాత్రం రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖామంత్రి ఎన్ఎండీ ఫరూక్ దక్కించుకున్నారు. విద్య, ఐటీ శాఖామంత్రిగా ఉన్న నారా లోకేశ్కు ఎనిమిదో స్థానం రాగా, రెండో స్థానంలో కందుల దుర్గేశ్, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదో స్థానంలో డోలా బాలవీరాంజేనయ స్వామి, ఏడో స్థానంలో సత్యకుమార్, తొమ్మిదో స్థానంలో బీసీ జనార్థన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పదో స్థానం, 11వ స్థానంలో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర, 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు 18వ స్థానంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో గుమ్మిడి సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్యప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నిలిచారు. మంత్రుల పేషీల్లోకి వచ్చే ఫైళ్ళ క్లియరెన్స్ను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు.
ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించారని.. వారి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు నుంచే ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామన్నారు. టీమ్ వర్క్గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమనే విషయాన్ని తాను విశ్వసిస్తానన్నారు. మంత్రులకు ర్యాంకుల కేటాయింపు ఎవరినీ తక్కువ చేయడానికి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు.
'పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్ వర్క్గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప.. విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం.
అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీం స్పిరిట్తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్త్రాల పరిష్కారంలో గురువారం విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా ఒకరితో మరొకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది' అని చెప్పారు.