1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 మే 2024 (17:56 IST)

జనసేన గాజు గ్లాసు గుర్తుపై గందరగోళం... ఈ దశలో మార్చలేమంటున్న ఈసీ!!

glass tumbler
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే, జనసేన ఎన్నికల గుర్తును పలు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో మినహా మిగిలిన స్థానాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించింది. ఇది కూటమి అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది. గాజు గ్లాసు గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో కూడా ఎవరికీ కేటాయించవద్దని జనసేన పార్టీ నేతల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది. 
 
అయితే, గాజు గ్లాసు గుర్తు అంశంపై టీడీపీ కూడా గురువారం అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతుంది. 
 
కాగా, టీడీపీ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ అని, ఈ గుర్తును ఏపీ వ్యాప్తంగా కేవలం జనసేన పార్టీకి రిజర్వు చేయలేమని, అందుకు సమయం మించిపోయిందని స్పష్టం చేసింది. 
 
ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలై కొనసాగుతుందని, గుర్తుల కేటాయింపు కూడా జరిగిందని తెలిపింది. ఇతరులకు కేటాయించిన ఎన్నికల గుర్తును ఈ దశలో మార్చలేమని ఈసీ పేర్కొంది. పిటిషనర్ కోరిన విధంగా చేస్తే ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన హైకోర్టు.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.