భోగాపురంలో ప్రారంభమైన విమాన సేవలు.. హైదరాబాద్ నుంచి ఇండిగో ల్యాండింగ్
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుండి వచ్చిన ఇండిగో విమానం ఇక్కడ దిగడంతో ఈ ప్రక్రియ మొదలైంది. అనేక ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన రెండు వారాల తర్వాత ఈ కార్యకలాపాలు మొదలయ్యాయి.
సోమవారం నాడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు ఈ విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను అందజేసి, ఈ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాల ఆరంభానికి నాంది పలికారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడం ఎంతో సంతోషం, గర్వకారణంగా వుందని. ఇది ఉత్తరాంధ్రకు ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకడమే కాకుండా, ఈ ప్రాంతానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందని రామ్ మోహన్ నాయుడు ఒక సందేశంలో పేర్కొన్నారు.
ఈ విమానాశ్రయంలో కార్యకలాపాల ప్రారంభాన్ని రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక కొత్త అధ్యాయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరాలను తీర్చేలా రూపొందించిన ఈ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించారు.
హైదరాబాద్ నుండి మొదటి ఇండిగో విమానం రాగా, ఆ తర్వాత బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం వచ్చింది. హైదరాబాద్ నుండి వచ్చిన ఆ తొలి విమానం తిరిగి తెలంగాణ రాజధానికి బయలుదేరడం ద్వారా, ఇక్కడి నుండి మొదటి విమాన రాకపోకల ప్రక్రియ ప్రారంభమైంది. "భోగాపురం నుండి విమానాలు ఎలాగైతే ఆకాశంలోకి ఎగురుతాయో, అలాగే మన యువత ఆశయాలు, కలలు, భవిష్యత్తు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాయి. తద్వారా వారికి కొత్త అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
