శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (09:40 IST)

లింగ నిర్ధారణ చేస్తాడు.. ఆడపిల్ల అయితే అమ్మాల్సిందే.. వైద్యుడి వ్యాపారం

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఓ డాక్టర్ వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా నడుచుకున్నాడు. తన వద్దకు వచ్చే గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి.. అమ్మాయి అని తేలితే ఆ శిశువును అమ్మేలా ఒప్పందం

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఓ డాక్టర్ వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా నడుచుకున్నాడు. తన వద్దకు వచ్చే గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి.. అమ్మాయి అని తేలితే ఆ శిశువును అమ్మేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇలా గత కొన్నేళ్లుగా కురువి కేంద్రంగా శిశు విక్రయాలకు పాల్పడుతూ వచ్చాడీ వైద్యుడు. ఇతని గుట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన వైద్యుడు శ్రీనివాస్‌ కొన్నేళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నాడు. ఈయన తన వద్దకు వచ్చే గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తాడు. ఈ పరీక్షల్లో అమ్మాయి అని తేలితే ఆ తల్లిదండ్రులతో ముందుగానే శిశువును విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకుంటానే ఆరోపణలు ఉన్నాయి. ఇలా లక్షలాది రూపాయలను వెనకేసుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఖమ్మంలోని బల్లేపల్లి జయనగర్‌ కాలనీకి చెందిన పిల్లలు లేని ఓ జంట ఆరు నెలల క్రితం అప్పుడే పుట్టిన ఓ పాపను రూ.50 వేలకు విక్రయించాడని సమాచారం. ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐసీడీఎస్‌ అధికారులతో కలిసి ఆ దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ఆ పసిపాపను శిశు గృహకు తరలించారు. 
 
తమకు 23 ఏళ్లుగా సంతానం లేకపోవడంతో కురవిలోని డాక్టర్‌ను సంప్రదించామని, పాప తల్లితో మాట్లాడి దత్తతగా తీసుకొచ్చామని ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. ఎవరికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. అయితే శ్రీనివాస్‌ను అనుమానించిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో ఎనిమిదేళ్లుగా అతను పసిపిల్లలను విక్రయిస్తున్నట్టు అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతను విక్రయించిన ఆడశిశువుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.