సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని పిల్లనిచ్చి పెళ్లిచేస్తే... ఆడపిల్ల పుట్టిందనీ అవహేళన చేశారు!
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఆడపిల్ల పుట్టిందనీ అవహేళన చేసి ఇంటి నుంచి గెంటేశారు. మైదుకూరులో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఆడపిల్ల పుట్టిందనీ అవహేళన చేసి ఇంటి నుంచి గెంటేశారు. మైదుకూరులో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... దువ్వూరు మండలానికి చెందిన అమ్మాయిని మైదుకూరులోని వినాయకనగర్కు చెందిన పత్తి నరసింహులు, గోపాలమ్మ రెండో కుమారుడు మనోహర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్కిచ్చి గత ఏడాది మే 29వ తేదీన వివాహం చేశారు. కట్నం కింద రూ.2 లక్షల నగదు, రూ.5.5 లక్షల విలువైన బంగారు నగలు ఇచ్చారు.
3 నెలల తర్వాత ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి అదనపు కట్నం కావాలంటూ.. అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆడబిడ్డ వరలక్ష్మి, ఆమె భర్త ప్రసాద్, బావ సురేష్, తోడికోడలు శ్రీవిద్య నుంచి కూడా వేధింపులు ఎక్కువ కావడంతో పాటు తనను కొట్టి చంపుతామని బెదిరించారని బాధిత మహిళ పేర్కొంది.
దీంతో ఆమె కొంతమంది పెద్దమనుషులు వచ్చి పంచాయతీ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొంత మంది పెద్ద మనుష్యులు మమ్మల్ని కలిపేందుకు అత్తింటికి వెళ్లగా ఆమెతో సంబంధం లేదని, పైగా ఆడపిల్ల పుట్టిందని హేళన చేయడంతో పాటు తనకు విడాకులు ఇస్తే వేరే వివాహం చేసుకుంటానంటూ చెప్పడం జరిగిందని, దీంతో మనోవేదనకు గురై తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.