శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (10:27 IST)

ఏపీ వ్యాప్తంగా 30 స్కిల్ కాలేజీల ఏర్పాటు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ కు అనుగుణంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్రంలో 30 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనిర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు.

కడపలోని రామకృష్ణ హై స్కూల్ లో ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాష, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబుతో కలిసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను చల్లా మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామకృష్ణ హై స్కూల్లో మొదటిసారి 300 మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

రాబోయే రోజులలో కడప జిల్లాలోని విద్యార్థులందరికీ అధునాతన టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం నాలుగు స్కిల్ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా సీఎం జగన్ పులివెందులలో లెదర్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కొప్పర్తి నందు 7000 ఎకరాలలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసి) నిర్మించడం జరుగుతుందన్నారు.

ఈఎంసిలో 2లక్షల50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివ‌ృద్ధి సంస్థ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు  ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు.