శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

విషాదాన్ని మిగిల్చిన విద్యార్థుల విహార యాత్ర.. గోదావరి నదిలో గల్లంతు

students missing
కాకినాడలో విద్యార్థుల విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలోని తాళ్ళరేవు మండలం, గోపులంక వద్ద గౌతమి గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా గాలించి ఆదివారం ఉదయం వెలికి తీశారు. మృతులను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. 
 
వెస్ట్ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు మూడు ద్విచక్ర వాహనాలపై శనివారం గోపులంక పుష్కరఘాట్‌ వద్దకు చేరుకున్నారు. తన పుట్టినరోజున స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన హనుమకొండ కార్తిక్‌(21) గోదావరిలో స్నానానికి దిగాడు. 
 
ఆ విద్యార్థి నీటిలో మునిగిపోతుండటాన్ని ఒడ్టునున్న మిగిలిన ఆరుగురిలో మద్దెన ఫణీంద్ర గణేష్‌(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21)లు గమనించారు. కార్తిక్‌ను రక్షించేందుకు వెంటనే గోదావరిలో దిగారు. వీరు కూడా ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో వారిని ఒడ్డుకు తెచ్చేందుకు సలాది దుర్గామహేష్‌, కొమ్మిరెడ్డి చైతన్య నదిలో దిగారు. 
 
ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరితోపాటు వచ్చిన మరో యువకుడు నేదూరు భానుప్రసాద్‌ జరిగిన ఘటనతో భయాందోళన చెంది అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. అయితే, ఆ తర్వాత వారు గల్లంతైనట్టు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను గుర్తించారు.