శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (16:41 IST)

11 నెలల్లో రూ.8.86 కోట్ల విలువచేసే బంగారాన్ని పట్టేశారు... ఎక్కడో తెలుసా?

విదేశాల నుండి అక్రమంగా తరలించే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు నిత్యం సీజ్ చేస్తున్నారు. గత 11 నెలలలో శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు 28 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గల్ఫ్ దేశాల నుండి భారత్‌కి వచ్చే పేద ప్రయాణీకుల ద్వారా ఈ అక్రమ రవాణా చేస్తున్నారు. దీని విలువ సుమారు రూ.8.86 కోట్లు ఉండవచ్చు. అలాగే 2.72 కోట్లు విలువ చేసే విదేశీ నగదును కూడా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ వ్యవధిలోనే 67 కేసులు నమోదయ్యాయి, 13 మందిని నిందితులుగా అరెస్ట్ చేశారు. అయితే విదేశాల నుండి మనం ఏ వస్తువులు తెచ్చుకోవచ్చు, ఎంత మోతాదులలో తెచ్చుకోవచ్చు, ఏ వస్తువులపై నిషేధం ఉంది అనే విషయాల గురించి మనలో చాలా మందికి తెలియదు. విదేశాల నుండి వచ్చే వ్యక్తులు వారి వ్యక్తిగత లగేజీతోపాటు రెండు లీటర్ల మద్యం, వంద సిగరెట్లు, ఒక ల్యాప్‌టాప్ మాత్రమే తెచ్చుకోవచ్చు. 
 
విదేశాల నుంచి తెచ్చుకునే మిగతా వస్తువులపై ఆంక్షలు ఉన్నాయి. వాటికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు వాడుకునే ఫోన్ కాకుండా అదనంగా ఫోన్ తెచ్చుకోవాలంటే దానికి కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఇక బంగారం విషయానికి వస్తే, సంవత్సర కాలం కంటే ఎక్కువ రోజులు విదేశాలలో ఉన్న మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల బంగారు తెచ్చుకోవచ్చు. 
 
ఆరు నెలల కంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉన్నవారు ఒక కిలో వరకూ బంగారు బిస్కెట్‌లు తెచ్చుకోవచ్చు. అయితే దాన్ని విమానాశ్రయంలోని కౌంటర్‌ల వద్ద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా బయటకు తీసుకువస్తే స్మగ్లింగ్‌గా పరిగణిస్తారు. అనుమతిని అతిక్రమించి వస్తువులను తీసుకువస్తే కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తారు. ప్రయాణీకులు ఈ విషయంలో అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని అధికారులు చెబుతున్నారు. దీని గురించిన సమాచారం కస్టమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.