శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:04 IST)

ఏంటీ జన జాతర.... వైసీపీ పేరెత్తకుండా చురకలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పార్టీ నేతలు చేస్తున్న హంగామాపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చురకలంటించారు. లాక్‌డౌన్ వేళ అధికార పార్టీ నేతలు జన జాతర చేయడం పట్ల తీవ్ర ఆక్షేపం వ్యక్తం చేశారు. పైగా, లాక్‌డౌన్ ఆంక్షలు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 
 
ఇదే అశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నాం. ఈ లాక్‌డౌన్ ఆంక్షలు అందరికీ సమానమే. అధికార పక్షమైనా, విపక్షమైనా నిబంధనలు పాటించి తీరాల్సిందే. లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు సహాయం పేరిట చేస్తున్న జన జాతరపై ఆయన పరోక్షంగా స్పందించారు. సూటిగా వైసీపీ పేరెత్తకుండా, ఆ పార్టీకి చురకలంటించారు. 'కొందరు ట్రాక్టర్‌ ర్యాలీలు, సమావేశాలు, చిన్న చిన్న సభలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా సూచించాను' అని తెలిపారు. 
 
పైగా, కేసుల సంఖ్య తగ్గుముఖంపట్టి, ప్రస్తుతం కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారంతా కోలుకునేదాకా లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. కరోనా తీవ్రతను అనుసరించి గ్రీన్‌జోన్‌లలో ఆంక్షల విధింపులో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. గ్రీన్‌జోన్‌లలో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతించామన్నారు. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసుల ద్వారా నిర్వహించే ప్రజా రవాణాకు ఇప్పట్లో అనుమతించబోమని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.