శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (19:37 IST)

గోవాలో కేసినోలు నిషేధించాల‌ని ప్ర‌ధాని మోదీని అడ‌గండి

గుడివాడ ప్రజానీకానికి సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలో తెలియదు, తాను నేర్పుతాను అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బయలుదేరాడ‌ని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. సోము వీర్రాజు వ్యవహార శైలి చూస్తుంటే... ఆయన బీజేపీకి అధ్యక్షుడో.. లేక టీడీపీ బీ- గ్రూపుకు అధ్యక్షుడో అర్థం కావడం లేద‌న్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులను పక్కన పెట్టుకుని, చంద్రబాబు ఎజెండాకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి సోము వీర్రాజు.  పండుగలు ఎలా చేసుకోవాలి, ఇళ్లల్లో అంట్లు ఎలా తోముకోవాలో.. బట్టలు ఎలా ఉతుక్కోవాలో ఎవరి ఇళ్ళల్లో వారు చేసుకుంటారు. ఈయన చెప్పేదేంటి, ఎలా ఉండాలో, పండుగలు ఎలా చేయాలో.. సోము వీర్రాజు దగ్గర  పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం త‌మ‌కు లేద‌న్నారు. 
 
 
గోవా కల్చర్ గుడివాడకు వచ్చిందని సోము వీర్రాజు అంటున్నాడ‌ని, గోవా భారత దేశంలో లేదా? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం కూడా బీజేపీదే. మరి, ఎందుకు అటువంటి కేసినోలను బ్యాన్ చేయరని వెళ్ళి ప్రధానమంత్రిని అడగండి, అదిచేతగాక కేసినోలను, డ్యాన్సులను ఆరోపణలు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండద‌ని మంత్రి నాని చుర‌క‌లు వేశారు. 
 
 
సోము వీర్రాజు గారికి సలహా ఇస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం ట్రాప్ లో పడకుండా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా వ్యవహరించండి. విజయవాడలో ఒకరకంగా, హైదరాబాద్ లో మరోరకంగా.. గోవాలో ఇంకోరకంగా కాకుండా.. దేశమంతా ఒకేరకంగా ఉండే విధంగా చూడమని ప్రధానమంత్రిని కోరండి. హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీలో కూడా గోవా సంస్కృతి ఉంది. మీరు ముందు అక్కడ ఉద్యమం చేసి,  బెల్లీ డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు ఆపించండి. ఆ తర్వాత దేశమంతా  అన్ని చోట్లా ఆపాలని డిమాండ్ చేస్తున్నాన‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.