1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (11:43 IST)

నడికుడి రైల్వే స్టేషన్‌లో దొంగల బీభత్సం - ప్రయాణికులపై దాడి.. దోపిడీ

గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులపై దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని పారిపోయారు. దీనిపై పల్నాడు ప్రాంతంలోని పలు పోలీస్ స్టేషన్లకు రైల్వే పోలీసులు సమాచారం అందించి, దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. 
 
నడికుడి రైల్వే స్టేషన్‌లో దుర్గి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెన్నై వెళ్లడానికి స్టేషన్‌కు చేరుకుని రెండో నంబరు ఫ్లాట్‌పామ్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో గోగులపాడు రోడ్డు మార్గంలోని ఖాళీ స్థలం నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ఫ్లాట్‌ఫామ్‌‍పైకి వచ్చారు. 
 
రైలు కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు ప్రయాణికులను రైల్వే పోలీసులు పిలుస్తున్నారంటూ కొట్టుకుంటూ బలవంతంగా దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారి వద్ద నుంచి రెండు బ్యాగులతో పాటు వారు ధరించిన బంగారు ఆభరణాలు, వారి వద్ద ఉన్న నగదును తీసుకుని సిద్ధంగా ఉన్న తెలుపు రంగు కారులో పారిపోయారు. 
 
అయితే, ప్రయాణికుల నుంచి దోచుకుని వెళ్లిన బ్యాగుల్లో రూ.89 లక్షల నగదు ఉన్నట్టు బాధితులు వెల్లడించారు. వ్యాపారం నిమిత్తం చెన్నైకు తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే అప్రమత్తమై పల్నాడు ప్రాంతంలోని పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. దోపిడీ దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.