శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (17:12 IST)

చంద్రబాబు నికర ఆస్తి రూ.3.87 కోట్లు.. దేవాన్ష్ ఆస్తి రూ.19.42 కోట్లు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలు మరోమారు వెల్లడించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. ఇందులో చంద్రబాబు నాయుడు ఆస్తి విలువ గత యేడాదితో పోల్చితే ఈ యేడాది రూ.85 లక్షలు పెరిగినట్టు వెల్లడించారు. అంటే చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ.3.87 కోట్లు కాగా, అప్పులు రూ.5.13 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే, తన ఆస్తి విలువ రూ.24 కోట్లు అని, తన భార్య బ్రాహ్మణి ఆస్తి విలువ రూ.15.68 లక్షలు, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తి రూ.19.42 కోట్లు, నారా భువనేశ్వరి ఆస్తి విలువ రూ.53 కోట్లు అని వివరించారు. ఇందులో నారా భువనేశ్వరి ఆస్తి విలువ రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గినట్టు ఆయన వివరించారు. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు.
 
ఇపుడు తమపై విమర్శలు చేసేవారు తమతమ ఆస్తుల వివరాలను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 'బినామీ భూములు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. క్రమశిక్షణ, పట్టుదలతో వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నాం. కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పీఏ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీకి రూ.2.68 లక్షలు దొరికాయి.. ఆయనకే తిరిగి ఇచ్చేశారు. మేం ఏనాడు తప్పు చేయలేదు.. ఏం దొరకనప్పుడు ఏం చెప్పాలి?. నిండా మునిగిన వాళ్లు ఏం మాట్లాడరు కానీ.. ఏం దొరికాయని  మేం సమాధానం చెప్పాలి' అని ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరహాలో తాము బినామీ కంపెనీలు పెట్టలేదు, ఇల్లు కట్టలేదని చెప్పారు. కార్లు కొనలేదని గుర్తుచేశారు. తుగ్లక్ ఆస్తులు ఈడీ, సీబీఐ ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు. వైసీపీలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఉందని మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం అని చెప్పారు. ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం లెక్కలు వెయ్యలేదన్నారు.