1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (12:11 IST)

అడ్దదిడ్డమైన బిల్లులు ఆడ్డుకుంటే మండలిని రద్దు చేస్తారా? నారా లోకేశ్

సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకొచ్చే అడ్డదిడ్డమైన బిల్లులను అడ్డుకున్నంతమాత్రాన శాసనమండలిని రద్దు చేస్తారా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఏపీ మంత్రివర్గం శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, బిల్లులు ఆగాయన్న సాకుతో మండలిని రద్దు చేయాలని జగన్‌ ప్రభుత్వం అనుకోవడం మూర్ఖత్వమన్నారు. 
 
'మా ప్రభుత్వ హయాంలోనూ వైద్యశాఖకు చెందిన బిల్లు ఒకటి మండలిలో ఆగిపోయింది. అంత మాత్రాన మేము కక్షగట్టామా? మండలిలో ఈ ప్రభుత్వానికి చెందిన ఏ బిల్లునూ ఆపలేదు. సవరణలు మాత్రం సూచించాం. సవరణలు ఇచ్చినంత మాత్రాన మండలిని రద్దు చేస్తారా' అని ప్రశ్నించారు. 
 
పైగా, మండలికి సంబంధించి రాష్ట్రాలు పంపిన తీర్మానాలు కేంద్రం వద్ద రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, సీరియల్‌ ప్రకారం పార్లమెంటులో బిల్లులు వస్తాయి తప్ప రాష్ట్రం పంపిందని వెంటనే తీర్మానం చేయరని చెప్పారు. అంతేకాకుండా, మండలిని రద్దు చేస్తే తమ కంటే వైసీపీయే ఎక్కువ నష్టపోతుందని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
మరో యేడాదిలో వైసీపీకే మండలిలో మెజారిటీ లభించబోతోందని, ఫలితంగా అనేకమందికి అక్కడ చోటు కల్పించే అవకాశాన్ని ఆ పార్టీ చేజేతులా కోల్పోతుందని విశ్లేషించారు. రద్దుకు రాష్ట్రప్రభుత్వం తీర్మానం చేసి పంపినా కేంద్రం అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోదని మాజీ స్పీకర్‌ యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. 
 
ఇప్పటికే మండలి రద్దు, పునరుద్ధరణకు సంబంధించి వివిధ రాష్ట్రాల తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఒకవేళ కేంద్రం అంగీకరించినా రద్దు ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుందన్నారు. పునరుద్ధరణకు వైఎస్‌ హయాంలో మూడేళ్లు పట్టిన విషయాన్ని గుర్తుచేశారు.