1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (10:16 IST)

శ్మశానాన్ని ఎలా లీజుకు ఇస్తారు : నారా లోకేశ్

nara lokesh
రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో నిర్మించిన భవనాలను అద్దెకు ఇవ్వాలన్న వైకాపా ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని శ్మశానంతో పోల్చిన వైకాపా నేతలు ఇపుడు ఆ భవనాలను ఎలా అద్దెకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అమరావతిని నాడు శ్మశానం అన్న వైకాపా నేతలు నేడు ఎకరా భూమిని రూ.పది కోట్లకు అమ్మకానికి ఎలా పెట్టారని నిలదీశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అమరావతిపై కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
 
అప్పట్లో అమరావతికి వరదలు, భూకంపాల ముప్పు ఉందని ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక శ్మశానం అంటూ ప్రచారం చేశారని ఇపుడేమో ఎకరం రూ.10 కోట్లకు అమ్మకానికి ఎలా పెట్టారని లోకేశ్ ప్రశ్నించారు. 
 
గ్రాఫిక్స్‌ను లీజుకు ఎలా ఇస్తారు : సర్కారుకు రైతుల ప్రశ్న!
 
రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో ఒక్క పక్కా భవనం కూడా నిర్మించలేదనీ, అవన్నీ గ్రాఫిక్స్ అంటూ విష ప్రచారం చేసిన వైకాపా ప్రభుత్వం ఇపుడు గ్రాఫిక్స్‌ను ఎలా లీజుకు ఇస్తారంటూ రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వాటిని అద్దెకు ఎలా ఇస్తారని రైతులు నిలదీస్తున్నారు. 
 
అమరావతి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రూపు-డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవన సముదాయాన్ని లీజుకు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. దీనిపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. అమరావతిని రాజమౌళి సినిమాలోని గ్రాఫిక్స్‌ అంటూ అవహేళన చేసిన వైకాపా నాయుకులు ఇపుుడ వాటిని అద్దెకు ఎలా ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వాటిని ప్రైవేటు సంస్థల కోసం అద్దెకు ఇవ్వాలనుకోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్ముకోవడం, అప్పులు తెచ్చుకోవడం, అద్దెకు ఇచ్చుకోవడం, తనఖా పెట్టడం తప్ప ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి శూన్యమన్నారు.