నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రులకు తెలియకుండా దాచిన యాజమాన్యం
తిరుపతి - రేణిగుంట రోడ్డులోని నారాయణ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కమలేష్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
తిరుపతి - రేణిగుంట రోడ్డులోని నారాయణ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కమలేష్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నారాయణ కళాశాలలోని అబ్దుల్ కలాం బ్లాక్లో కమలేష్ ప్రస్తుతం విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత తన బ్లాక్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఎవరికీ తెలియకుండా కమలేష్ను నారాయణాద్రి ఆసుపత్రికి తరలించింది. అప్పటికే కమలేష్ మరణించాడని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని హాస్టల్కు తిరిగి తీసుకెళ్ళిపోయింది. ఉదయం నుంచి బంధువులు కళాశాల వద్ద ఉన్నా మృతదేహాన్ని మాత్రం వారికి అప్పగించలేదు.
మీడియాను కూడా నారాయణ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే కమలేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు చదువు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.