మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 24 జనవరి 2021 (13:51 IST)

హక్కుల పట్ల అవగాహనే ధ్యేయంగా జాతీయ బాలికా దినోత్సవం: డాక్టర్ కృతికా శుక్లా

సమాజంలో బాలికల సంరక్షణతో పాటు హక్కులు, ఆరోగ్యం, విద్యా, సామాజిక ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించటమే ధ్యేయంగా ప్రతి ఏడాది జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని (జనవరి24) పురస్కరించుకుని భారత పరిశ్రమల సమాఖ్య నేతృత్వంలొని యంగ్ ఇండియన్స్ అమరావతి చాప్టర్ రూపొందించిన ప్రచార గోడ పత్రికను కృతికా శుక్లా ఆవిష్కరించారు. అమరావతిలోని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
ఈ సందర్భంగా డాక్టర్ శుక్లా మాట్లాడుతూ ఆడ పిల్ల సాధించే అసాధారణ విజయాలకు గుర్తుగా ఒక ఉత్సవ వేడుక మాదిరి బాలికా దినోత్సవం జరుపుకోవాలన్నారు. ప్రస్తుతం పురషులతో సమానంగా  అనేక రంగాలలో ఆడ పిల్లలు కనబరచే ప్రావీణ్యం మనకు గర్వకారణమన్నారు.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో బాలికా సంరక్షణకు విభిన్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కృతికా శుక్లా వివరించారు. మన దేశంలో ప్రస్తుతం మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అబ్బాయే పుట్టాలనే ఆలోచన నుంచీ,  అమ్మాయి పుడితే బాగుండు అనుకునే మనస్తత్వం కనిపిస్తోందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 2008 నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
 
యంగ్ ఇండియన్స్ అమరావతి చాప్టర్ అధ్యక్షురాలు లీనా చౌదరి మాట్లాడుతూ ఆడ పిల్లల పట్ల భేదభావాన్ని ప్రదర్శించటం సరికాదని, వారికి బాలురతో సమానంగా ఎదిగే అవకాశాలు లభించేలా చూడాలన్నారు. యంగ్ ఇండియన్స్ అమరావతి చాప్టర్ నేతృత్వంలో బాలికల సర్వతోముఖాభివృద్దికి అనుగుణమైన పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
 
గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో యంగ్ ఇండియన్స్ అమరావతి చాప్టర్ సభ్యులు ప్రదీప్ , వందన, వేణు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు యంగ్ ఇండియన్స్ నేతృత్వంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనాధ విద్యార్ధులకు పుస్తకాలు, వస్త్రాలు అందచేయటంతో పాటు వృద్దాశ్రమాలలో ఆహర వితరణ చేపట్టనున్నారు.