మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (13:43 IST)

నయీమ్ ఇంట్లో రూ.2 కోట్ల విలువ చేసే చీరలు.. వినాయకచవితి రోజున మహిళలకు పంచేందుకు

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, మాజీ మావోయిస్టు నయీమ్ ఆస్తులు గురించి విచారిస్తున్న పోలీసులు, వాటిని గురించి తెలుసుకుంటున్న ప్రభుత్వానికి కళ్లు బైర్లుకమ్ముతున్నాయి.

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, మాజీ మావోయిస్టు నయీమ్ ఆస్తులు గురించి విచారిస్తున్న పోలీసులు, వాటిని గురించి తెలుసుకుంటున్న ప్రభుత్వానికి కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. దశాబ్దాలుగా నేర సామ్రాజ్యాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించడం మొదలుపెట్టిన నయీమ్ మొత్తం ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఇప్పటికే అతడి స్థావరాలపై దాడులు చేస్తున్న ఉన్నతాధికారులు… రూ.కోట్ల కొద్దీ నగదు, కిలోల కొద్దీ బంగారం, వందల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడి అక్రమార్జనకు సంబంధించి పోలీసులు జరుపుతున్న విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు రోజురోజుకి వెలుగులోకి వస్తున్నాయి. 
 
తాజాగా నగరంలోని పుప్పాలగూడలోని నయీమ్ ఇంటిలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే చీరలు బయటపడ్డాయి. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మహిళలకు పంచేందుకే నయీమ్ ఈ చీరలను కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. 
 
తనపై పడిన చెడు పేరును చెరిపేసుకునేందుకు నయీమ్ పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడని, అందులో భాగంగానే ఈ చీరల పంపిణీకి ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు అంటున్నారు. అయితే కొనుగోలు చేసిన చీరలను మహిళలకు పంపిణీ చేయకముందే అతడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైపోయాడు.