శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 1 జులై 2020 (16:46 IST)

టూరిజం మేనేజర్ ఊచలు లెక్కిస్తున్నాడు

మాస్క్ పెట్టుకో అన్నందుకు వికలాంగురాలని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదిన నెల్లూరు పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పాపం పండింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
వికలాంగురాలిని అతి దారుణంగా కొడుతున్న విజువల్స్ సి.సి.ఫుటేజ్ ద్వారా మీడియాకు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అప్పటి వరకు స్పందించని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళడంతో విషయం కాస్త మరింత సీరియస్ అయ్యింది.
 
అలాగే టిడిపి నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద భాస్కర్‌ను అరెస్టు చేశారు. అతనికి కోవిడ్-19 పరీక్షలు  చేయించారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే సబ్ జైలుకు తరలించేందుకు సిద్ధమయ్యారు.
 
వికలాంగురాలిపై దాడి ఘటనను వికలాంగుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. దివ్యాంగులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సంఘం నేతలు.