యువత ఆవేదనను అర్థం చేసుకని పరిష్కారాలు చూపాలి.. పవన్
ఢిల్లీ నిరసనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా శాంతియుతంగా నిరసన తెలిపే పూర్తి హక్కు ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా సంబంధిత సమస్యలు, నిరుద్యోగంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. యువత ఆవేదనను అర్థం చేసుకుని తగిన పరిష్కారాలు చూపడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన వెల్లడించారు.
అయితే ఈ నిరసనల ముసుగులో దేశ సమగ్రతకు సవాలు విసిరేలా వ్యవహరించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. ఇంకా హింసకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు. దేశాన్ని విభజించే లక్ష్యంతో జరిగే ప్రతి కుట్రను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకునే దేశం పాత విద్యా విధానాలను వీడి ముందుకు సాగాలని సూచించారు. దేశ ఐక్యతకు భంగం కలిగించే శక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు.
