మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: సోమవారం, 20 జూన్ 2016 (16:43 IST)

టిడిపిలోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడానా...?! చిత్తూరు జిల్లాలో వెంటిలేటర్‌పై వైసిపి

చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండగా అదే బాటలో మరో నాయకుడు కూడా చేరనున్నాడు. అది కూడా సీనియర్‌ నేతగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ

చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండగా అదే బాటలో మరో నాయకుడు కూడా చేరనున్నాడు. అది కూడా సీనియర్‌ నేతగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారన్న వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.
 
కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా పనిచేసి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీశాఖా మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి ఆయన మరణానంతరం వైఎస్‌ఆర్‌ సిపిలో చేరారు. ఆ పార్టీలో సీనియర్‌ నేతగా పెద్దిరెడ్డి ఉంటున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌ రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. దాంతో పెద్దిరెడ్డి వైసిపిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దిరెడ్డి పార్టీలో చురుగ్గా ఉంటూ వచ్చారు. చిత్తూరు జిల్లాలో  పార్టీ కార్యక్రమాలు ఎలాంటివి జరిగినా పెద్దిరెడ్డి ముందుండి నడిపిస్తారు. 
 
ఎంతమంది జనం కావాలంటే అంతమంది జనాన్ని తీసుకురాగల సమర్థుడు పెద్దిరెడ్డి. తనకంటూ ఒక అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుని సీనియర్‌ నేతగా పేరొందారు. అయితే ప్రస్తుతం పెద్దిరెడ్డికి వైసిపిలో తగిన స్థానం కల్పించలేదని ఆయన అనుచరులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దాంతోపాటు సీనియర్‌ నాయకుడన్న మర్యాద కూడా లేకుండా జగన్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నట్లు పెద్దిరెడ్డే చాలాసార్లు తన అనుచరులతో చెప్పుకుని బాధపడినట్లు సమాచారం. 
 
దీంతో మనస్థాపానికి గురైన పెద్దిరెడ్డి పార్టీని వీడి టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కుమారుడు మిథున్‌రెడ్డి తన తండ్రిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఒకే పార్టీలో ఉందామని, పార్టీని మారినంత మాత్రాన వచ్చే లాభమేమీ లేదని పెద్దిరెడ్డిని  మిథున్‌ బుజ్జగించినట్లు సమాచారం. అయితే అందుకు పెద్దిరెడ్డి ఎంతమాత్రమూ ఒప్పుకోనట్లు సమాచారం.
 
పుంగనూరులో రెండురోజుల క్రితం తన అనుచరులతో రహస్యంగా సమావేశమైన పెద్దిరెడ్డి పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే టిడిపిలోకి వెళితే మనకు సముచిత స్థానం లభిస్తుందా అన్న అనుమానాన్ని అనుచరులు పెద్దిరెడ్డి ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పుంగనూరులో టిడిపికి పెద్దగా పట్టు లేదు. పెద్దిరెడ్డి వెళ్ళినా అడ్డుపడే నాయకుడు కూడా లేడు. దీంతో నేరుగా నారా లోకేష్‌ను కలిసి టిడిపిలోకి రావాలన్న నిర్ణయాన్ని త్వరలో పెద్దిరెడ్డి చెప్పనున్నట్లు సమాచారం. లేకుంటే చిత్తూరు ఎమ్మెల్యే డి.కె.సత్యప్రభ ద్వారా నారా లోకేష్‌కు చెప్పాలన్న ఆలోచనలో కూడా పెద్దిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
 
మొత్తంమీద ఇప్పటికే పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకోగా మరో సీనియర్‌ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉండటంతో వైసిపి చిత్తూరు జిల్లాలో దాదాపు ఖాళీ అయిపోయినట్లే.