శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:10 IST)

కిక్ బాక్సింగ్ లో స్వర్ణ పతక విజేత చలాది సతీష్

వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ ఏ కె ఓ) ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టు 26 నుండి 29 వరకు జరిగిన జాతీయ పోటీలలో కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన చలాది సతీష్ రెండు ప‌త‌కాలు సాధించాడు. 74 కేజీల లైట్ కిక్ బాక్సింగ్ కేటగిరిలో స్వర్ణ పతకం, 74 కె.జి లలైట్ కాంటాక్ట్ కేటగిరీలో రజత పతకం సాధించి జాతీయ స్థాయిలో స‌తీష్ విజయం సాధించడంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభినంద‌న‌లు తెలిపారు. 
 
ఆంధ్రా విశ్వవిద్యాలయం జర్నలిజం  మాస్ కమ్యూనికేషన్ విభాగం అధిపతి ప్రో.బాబీ వర్ధన్ తన సందేశంలో తమ విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థి సతీష్ జాతీయ స్థాయిలో ఈ స్వర్ణ పతకం సాధించటం విశ్వ విద్యాలయనికి ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కె గుప్తా,భారత ప్రభుత్వ సమాచార శాఖ  అదనపు డైరెక్టర్ జనరల్ డి.మురళీమోహన్,  హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధికారి సురేష్ ధర్మవరపు, విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ విభాగం అధిపతి డా.జి.కొండలరావు, అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ తెలుగులోగిలి అధ్యక్షులు డా.పి.ఎస్.రావులతో పాటు పలువురు అధికార అనధికారులు సతీష్ ని అభినందించారు.

ఈ సందర్భంగా స్వర్ణ పతక విజేత సతీష్ మాట్లాడుతూ, తన విజయానికి బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏయిట్ లంబ్స్ మాస్టర్స్ వినోద్ రెడ్డి, పునీత్ రెడ్డి ల నేతృత్వంలో పొందిన శిక్షణ, వారి సలహాలు, మెలకువలు ఎంతో స్ఫూర్తి ఇచ్చాయన్నారు. త‌న ప‌త‌కాల‌ను ఉభయ తెలుగు రాష్ట్రాలు,కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించి సతీష్ మాతృ భాష పై తనకున్న అభిమానం చాటుకున్నారు.