స్నేక్ గ్యాంగ్ కీచకులంతా ముద్దాయిలే... 11న శిక్షలు ఖరారు : రంగారెడ్డి కోర్టు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కీచకులంతా దోషులేనని రంగారెడ్డి కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులోని మొత్తం 8 మందిని కోర్టు ముద్దాయిలుగా ప్రకటించింది. వీరికి బుధవారం శిక్షలు ఖరారు చేయనుంది.
2014 జులై 31న స్నేక్గ్యాంగ్ సభ్యులు ఫాంహౌజ్లో చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. దీనిపై పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులపై భారత శిక్షా స్మృతి 376డి, 341, 452, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని (ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ్ (ఉస్మాన్నగర్), తయ్యబ్ బసలమ (బండ్లగూడ,బార్కాస్), మహ్మద్ పర్వేజ్ (షాయిన్నగర్), సయ్యద్ అన్వర్ (షాయిన్నగర్), ఖాజా అహ్మద్ (ఉస్మాన్నగర్), మహ్మద్ ఇబ్రాహీం (షాయిన్నగర్), అలీ బరాక్బ్ (షాయిన్నగర్), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మిగతా ఇద్దరు బెయిల్పై బయటకు వచ్చారు.
ఈ కేసును విచారించిన కోర్టు.. మంగళవారం తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో A9గా ఉన్న సాలం హమ్దీ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. నిందితులకు బుధవారం శిక్షలు ఖరారు కానున్నాయి.