1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (23:10 IST)

రూ.5177 కోట్లతో గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

రాష్ట్రంలో ఎస్టీ సబ్ ప్లాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది రూ.5177 కోట్లను గిరిజనాభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. సబ్ ప్లాన్ లో ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించిన ఈ నిధుల్లో ఒక్క రుపాయి కూడా వృధా కాకుండా పూర్తి స్థాయిలో నిధులను గిరిజనుల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. ఎస్టీ నిధుల కేటాయింపుల్లో ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలకు, ఏజెన్సీ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

 
రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం  ఎస్టీ సబ్ ప్లాన్ కు చెందిన రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు సంబంధించి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని కితాబిచ్చారు.

ఈ ఏడాది ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా గిరిజనుల కోసం కేటాయించిన రూ.5177 కోట్ల రుపాయలలో నవరత్నాలకు సంబంధించిన పథకాలు, మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయడానికి రూ.3318 కోట్ల దాకా ఖర్చవుతాయని చెప్పారు. నవరత్నాలు, మేనిఫెస్టోలోని హామీలకు సంబంధించిన పనులు ఎలాగూ జరుగుతాయని, ఇవి కాకుండా మిగిలిన నిధులతో చేపట్టే కార్యక్రమాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎనిమిది నెలల కాలం గడిచిపోయిన నేపథ్యంలో మిగిలిన 4 నెలల కాలంలోనే ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించిన నిధులనన్నింటినీ ఖర్చు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్టీ నిధులను దారి మళ్లించిన తరహాలో కాకుండా ఎస్టీలకు చెందాల్సిన ప్రతి రుపాయి కూడా వారి కోసమే ఖర్చు పెట్టేలా చూసుకోవాలని, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నూటికి నూరు శాతం ఖర్చు చేయాలని పుష్ప శ్రీవాణి అధికారులను ఆదేశించారు.

ఎస్టీ నిధులను కేటాయించడంలో ప్రజా ప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలకు, అలాగే ఏజెన్సీ ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు లేని గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని కోరారు. గ్రామీణ తాగునీటి సరఫరా పథకం లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్లు, మోటార్లు పని చేయని పరిస్థితులు ఉన్నాయన్నారు. అయితే వాటి నిర్వహణను కనీసం రెండేళ్ల పాటు చూసుకోవాల్సిన ప్రైవేటు సంస్థలు వాటి మరమ్మలను గురించి పట్టించుకోవడం లేదన్నారు.

అలాంటి సంస్థలను గుర్తించి వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, చెడిపోయిన సోలార్ పంపు సెట్లు, మోటార్లను మరమ్మతులు చేయించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించిన ప్రగతిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి కొన్నిశాఖలు ఎస్టీ నిధులను వినియోగించిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. గిరిజనులకు ఎంతో మేలు చేయాల్సిన కొన్ని ప్రభుత్వ శాఖలలో ఎస్టీ నిధుల వినియోగం ఒకటి, రెండు శాతం కూడా లేకపోవడం సమంజసం కాదన్నారు.

ఎస్టీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేసారు. ఎక్కువ శాఖల్లో 50శాతానికి లోపుగా మాత్రమే ఎస్టీ నిధులను ఖర్చు చేసారని ప్రస్తావించారు. అయితే అన్ని శాఖలు కూడా ఎస్టీలకు కేటాయించిన నిధులను 100శాతం ఖర్చు అయ్యేలా పని చేయాలని, ఈ నిధులతో చేపట్టే కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీ నుంచి ఆమోదాన్ని తీసుకోవాలని కోరారు. పాడేరు, రంపచోడవరం, చింతపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాలలో హార్టికల్చర్ ద్వారా ఇచ్చే పలు రకాల విత్తనాలకు గిరిజన రైతుల్లో ఎంతో డిమాండ్ ఉందని చెప్పారు.

వాటిని ఇప్పటికైనా సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొని తమ శాఖల ఆధ్వర్యంలో ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా గత ఏడాది చేపట్టిన పనులు, ఈ ఏడాది ప్రతిపాదనలను గురించి వివరించారు.