1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:18 IST)

గిరిజన రైతులకు ఒకేసారి రెండు విడతల ‘భరోసా’: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

కొత్తగా అటవీ హక్కు (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు పొందిన గిరిజన రైతులకు తొలి, మలివిడతల రైతుభరోసా మొత్తాన్ని కలిపి ఒక్కో రైతుకు రూ.11,500లను ఒకేసారి అందించడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులు తన కుటుంబ సభ్యులని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కితాబిచ్చారు.

అటవీ హక్కు పత్రాలు పొంది సాగుకు సిద్ధమైన గిరిజన రైతులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా పథకం వర్తింప చేస్తూ ఖరీఫ్‌ ఆరంభంలో ఇచ్చే రూ.7500తో పాటు, మలి విడతగా రబీ సీజన్‌ ఆరంభంలో ఇచ్చే రూ.4 వేలు కూడా కలిపి సుమారు లక్ష మంది గిరిజన రైతుల ఖాతాల్లో రూ.104 కోట్లను ముఖ్యమంత్రి జమ చేసిన నేపథ్యంలో మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పుష్ప శ్రీవాణి సిఎం జగన్మోహన్ రెడ్డి గిరిజన పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. 

ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమిని ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కొత్తగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజనులకు రైతుభరోసా మొత్తాలను కూడా అందిస్తామని హామీ ఇచ్చిన సిఎం తాను ఇచ్చిన మాట ప్రకారంగానే ఇప్పుడు తొలి, మలివిడత రైతుభరోసా మొత్తాలను ఒకేసారి అందించారని వివరించారు.

గిరిజనులు తాము పట్టాలుగా పొందిన భూముల ద్వారా ఉపాధిని పొందడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించడం జరిగిందని, అటవీ ప్రాంతాల్లో ఉండే భూముల్లో పంటలు పండించుకోవటానికి అవసరమైన నీటి వసతిని కల్పించుకోవడానికి, వాణిజ్య పంటలను, తోటలను పెంచుకోడానికి కావల్సిన అర్ధిక సహాయాన్ని వివిధ శాఖలకు చెందిన పథకాల ద్వారా అందించాలని కూడా మార్గదర్శకాలను  జారీ చేశారని తెలిపారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు చేసే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారని,  రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. దీంతో ఎస్సీ, ఎస్టీల నుంచి వందల సంఖ్యలో పారిశ్రామికవేత్తలు వచ్చేందుకు మార్గం ఏర్పడిందన్నారు.

ట్రైబల్ సబ్ ప్లాన్ లో భాగంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 48 ప్రభుత్వ శాఖల ద్వారా గిరిజనాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.4988 కోట్లను మంజూరు చేసి అందులో రూ.3726 కోట్లను 292 పథకాల కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే  వైయస్సార్ రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహన మిత్ర, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ విదేశీ విద్యాదీవెన తదితర 15 ప్రభుత్వ పథకాల ద్వారా గత మే నెలాఖరు నాటికే మొత్తం 18లక్షలా 40 వేల మంది గిరిజనుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లకు పైగా నేరుగా జమ చేయడం జరిగిందని పుష్ప శ్రీవాణి వివరించారు.