1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 23 మార్చి 2017 (02:43 IST)

బాలకృష్ణ చాలా మంచోడు, ఎవరినీ తిట్టరు, ఎవరినీ విమర్శించరు: జగన్ ఇంత మాట అన్నారా?

జగన్ తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేని మాత్రం ఇంతవరకూ పల్లెత్తు మాట అనలేదు. కారణం ఏంటి చెప్మా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. టీడీపీ ఎంఎల్ఏ, ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అంట

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలుగు దేశంలో ఎదుర్కోని నేత అంటూ లేడు. అసెంబ్లీలో అయితే టీడీపీ మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా ఒక ఆటాడుకోవడం, తర్వాత వారి చేతిలో అంతే స్థాయిలో అక్షింతలు వేయంచుకోవడం జగన్‌కి అలవాటైన విషయమే. వైకాపా మొత్తం మీద అసెంబ్లీలో అయినా, బయట మీడియాలో అయినా ధాటీగా, గణాంక సహితందా మాట్లాడే గొంతు జగన్‌దే అని అందరికీ తెలుసు.

 
అలాంటి జగన్ తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేని మాత్రం ఇంతవరకూ పల్లెత్తు మాట అనలేదు. కారణం ఏంటి చెప్మా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. టీడీపీ ఎంఎల్ఏ, ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అంటే ఎంత అభిమానం అంటే మాటల్లో చెప్పలేరట. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ హీరోగా వైఎస్ జగన్ ఒక భారీ బడ్జెట్ చిత్రం నిర్మించడానికి కూడా సంసిద్ధమయ్యారట. వ్యక్తిగతంగా కూడా బాలయ్య అంటే జగన్‌కి అభిమానం అట. 
 
ఇప్పుడంటే టీడీపీతో బద్ధవైరుధ్యం ఏర్పడిన కారణంగా వైఎస్ జగన్ బాలకృష్ణ గురించి బహిరంగంగా అభిమానం కురిపించలేని పరిస్థితి ఏర్పడటంతో కాస్త సైలెంట్ అయ్యారని వినికిడి. అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలో ఉన్నా ఇంతవరకు బాలకృష్ణపై జగన్ ఒక్క విమర్శ కూడా చేయలేదు ఎందుకు అని ప్రశ్న వస్తోంది. కారణం ఉంది మరి. బాలకృష్ణ కూడా జగన్‌పై ఇంతవరకు పరుష వ్యాఖ్యలు చేయలేదు. 
 
ఇంతవరకు బాగానే ఉంది కానీ జగన్, బాలకృష్ణల గత బంధాల గురించి అసెంబ్లీలో మంగళవారం కాస్త సరదా చర్చ నడిచింది. బాలకృష్ణ చాలా మంచోడు, ఎవరినీ తిట్టరు, ఎవరినీ విమర్శించరని జగన్ కితాబిచ్చినట్లు టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు జోక్ చేశారు. దానికి టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆశ్చర్యం నటిస్తూ జగన్ వ్యాఖ్యలు నిజమేనా అని రెట్టించి అడిగారు. బాబూరావు నిజమేనని, గతంలో బాలకృష్ణ అబిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా వైఎస్ జగన్ పనిచేశారని చెప్పడంతో అసెంబ్లీలో ఉన్నవారంతా పక్కున నవ్వేశారు.
 
ఈ నవ్వులు, జోక్స్‌ని పక్కన బెట్టి చూస్తే గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన జరిగి వివాదం ముదిరిన నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాస్త ఉదారంగా వ్యవహరించి బాలకృష్ణపై కేసు బుక్ కాకుండా చేశారన్నది బహిరంగ రహస్యమే. ఏమో మరి జగన్ తండ్రి తనను ఆరోజు కాపాడారన్న కృతజ్ఞత కూడా బాలకృష్ణలో ఉందేమో. ఆ భావనతోనే తన వియ్యంకుడిని, సీఎంని అసెంబ్లీలో కడిగిపారేస్తున్న జగన్‌ పట్ల ఆయన మృదువుగా వ్యవహరిస్తున్నారేమో.. 
 
దీని వెనుక నిజం బయటపడాలంటే బాలకృష్ణే నోరు విప్పాలి. ఆయన చేత నిజం మాట్లాడించే ధీరుడెవ్పరు. ప్రయత్నించి చూస్తే పోలా..