1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 9 జులై 2021 (14:45 IST)

వైఎస్సార్ బ్రాండ్ లేకపోతే ఒక్క ఓటు రాదు: షర్మిలకు శైలజ కౌంటర్

కాంగ్రెస్ దివంగత సీఎం వైఎస్సార్ పేరును ఒక బ్రాండ్‌లా అంద‌రూ వాడేస్తున్నార‌ని కాంగ్రెస్ నేత, ఏపీ సీసీ అధ్య‌క్షుడు  శైలజానాథ్ ఆరోపించారు. వై.ఎస్.ఆర్. పేరు పేరు వాడుకోకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పాల‌న్నారు. కొత్త పార్టీలు పెట్టేవారు రాజశేఖరరెడ్డి పేరు వాడుకోకుండా ఒక్క ఓటు తెచ్చుకునే దమ్ము లేదని ఎద్దేవా చేసారు.
 
పార్టీలు పెడుతున్నవారు ప్రజలకు ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని ష‌ర్మిల‌కు చుర‌క వేశారు.
ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కేంద్రం అమ్ముతుంటే, జగన్ నోరు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. వంద రూపాయలు డీజిల్ రేటు చేసిన ఘనత మోదీదని అన్నారు.
 
మోదీ ఆర్థిక మిత్రులకు నష్టం వస్తుందని పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అర శాతం అప్పు కోసం, సీఎం జగన్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోదీ దగ్గర కుదవపెడుతున్నారని ఆరోపించారు. ఏ ప్రాంతానికైనా నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. వివాదాలు సృష్టించుకుని, రెండు రాష్ట్రాల సీఎంలు రాజకీయాలు చేస్తున్నారని శైలజానాథ్ విమర్శించారు.