శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 మార్చి 2020 (22:34 IST)

తెలంగాణలో కరోనా వైరస్ రోగులు 17, దేశంలో 223 మంది

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 223కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు తెలిపింది. ఈ జాబితాలో 32 మంది విదేశీయులు, చనిపోయిన నలుగురు రోగులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 52 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, ఇది దేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించి అత్యధికం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్, ముంబై, పూణేల్లో లాక్డౌన్ ప్రకటించింది.
 
హైదరాబాద్ మరో COVID-19 పాజిటివ్ కేసు నమోదైంది. దీనితో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసులు 17కి చేరుకుంది. కొత్తగా నమోదైన హైదరాబాద్ రోగి లండన్ వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది. ఇక కేరళలో 28, ఉత్తర ప్రదేశ్ 23, పశ్చిమ బెంగాల్ 2, లడఖ్ 10, ఢిల్లీ 17, ఆంధ్రప్రదేశ్ 3 కేసులు నమోదయ్యాయి.
 
కాగా 22 మంది రోగులు ఇప్పటివరకు కరోనా వైరస్ నుండి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ మాట్లాడుతూ... కరోనా వైరస్‌తో పోరాడటానికి అవసరమైన వస్తువుల కొరత లేదన్నారు. కరోనా వైరస్ కారణంగా మన దేశంలో మరణించిన వారిలో శుక్రవారం జైపూర్‌లో మరణించిన ఇటాలియన్ వ్యక్తి లెక్కించబడడని తెలిపారు. కనుక దేశంలో మరణించిన వారి సంఖ్య నాలుగు అని ఆయన అన్నారు.