1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (13:57 IST)

ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన ధోనీ.. ఎందుకో తెలుసా?

Dhoni
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మోకాలి నొప్పులతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మిస్టర్‌ కూల్‌ అయిన ధోనీ ఇటీవల ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం.
 
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆఖరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  జార్ఖండ్‌ రాజధాని రాంచీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాపంగ్‌లో గల వందన్‌ సింగ్‌ ఖెర్వార్‌ అనే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారు. ఆయన హస్తవాసి గురించి స్థానికంగా మంచి పేరుంది.
 
ఈ విషయం తెలుసుకున్న ధోని ఆయన దగ్గరకు వెళ్లి మోకాలి నొప్పుల సమస్యల గురించి బయటపడే మార్గం గురించి అడిగాడు. కాల్షియం లోపం వల్ల తాను బాధపడుతున్నానని ఖెర్వార్‌కు ధోని చెప్పాడు. దీంతో ప్రతిసారి నాలుగు రోజులకు ఓసారి తన వద్దకు రావాల్సిందిగా సదరు వైద్యుడు సూచించాడు.
 
ఈ విషయాల గురించి ఆయుర్వేద డాక్టర్‌ వందన్‌ సింగ్‌ ఖెర్వార్‌ ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ''మొదటి సారి ధోని నా దగ్గరకు వచ్చినపుడు ఆయనను గుర్తుపట్టలేకపోయాను. కన్సల్టేషన్‌ ఫీజు కింద 20 రూపాయలు.. చికిత్సకై మందుల కోసం 20 రూపాయల మేర ప్రిస్కిప్షన్‌ రాశాను.
 
ధోని తల్లిదండ్రులకు కూడా నేను వైద్యం చేస్తున్నాను'' అని చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి గురించి తన గురించి తెలుసుకున్న ధోని తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. 
 
కాగా ధోని లాపంగ్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే, ధోని మాత్రం సెల్ఫీలు గట్రా వద్దంటూ వారిని సున్నితంగా వారిస్తున్నాడట.