1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (15:59 IST)

రసవత్తరంగా చెన్నై టెస్ట్ : ఇంగ్లండ్ వెన్నువిరిచిన భారత బౌలర్లు.. 134కే ఆలౌట్

చెన్నై టెస్ట్ మ్యాచ్ రెండో రోజే రసవత్తరంగా మారింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ జట్టు వెన్నువిరిచారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోమారు ఈ సిరీస్‌లో 5 వికెట్ల ప్రదర్శన కనబర్చిన వేళ ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. 
 
అశ్విన్ 23.5 ఓవర్లలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. కొత్త స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మకు కూడా 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
 
కాగా, భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను భారత బౌలర్లు కేవలం 6 పరుగులకే ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలిపోయింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. క్రమం తిప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు పనిబట్టారు. ఓలీ పోప్ 22 పరుగులు చేయగా, స్టోక్స్ 18 పరుగులు సాధించాడు.
 
ఇకపోతే, టీమిండియాకు 195 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తన రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పైచిలుకు పరుగులు చేస్తే ఇంగ్లండ్ ముందు కష్టసాధ్యమైన టార్గెట్ ఉంచే వీలుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.