1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (13:32 IST)

కామన్వెల్త్ పోరు : నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

cricket balls
కామన్వెల్త్ పోటీల్లో తొలిసారి మహిళా క్రికెట్ పోటీలను చూడబోతున్నాం. శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌, మెగ్ లానింగ్‌ కెప్టెన్సీ వహిస్తున్న ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. 
 
ఇప్పటికే బర్మింగ్‌హామ్‌కు జట్లన్నీ చేరిపోయాయి. 24 ఏళ్ల కిందట పురుషుల క్రికెట్‌లో సిల్వర్‌ గెలిచిన ఆసీస్‌.. మహిళా క్రికెట్‌లో స్వర్ణపతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోందని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్‌గ్రాత్ తెలిపింది. 
 
అయితే టీమ్‌ఇండియాతో తొలి పోరే అసలైన సవాల్‌ అని వ్యాఖ్యానించింది. 'టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌ ఎప్పుడు ఏవిధంగా మలుపు తిరుగుతుందో అంచనా వేయడం కష్టం. అసలే ఇది చాలా కఠినమైన టోర్నమెంట్. అంతేకాకుండా భారత్‌తో మొదటి మ్యాచ్‌ అంటే సవాల్‌తో కూడుకున్నదే. అయితే మా జట్టు కూడా  అద్భుతంగా ఆడుతోంది' అని వెల్లడించింది.
 
ప్రపంచ మహిళల క్రికెట్‌లో ఆసీస్‌ ఛాంపియన్‌. గత టీ20, వన్డే ప్రపంచకప్‌లను సొంతం చేసుకొని తన హవా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తొలిసారి కామన్వెల్త్‌ బరిలోకి దిగిన కంగారూల జట్టు స్వర్ణపతకంపైనే కన్నేసింది. 
 
ప్రస్తుతం కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రధాన క్రీడా గ్రామంలో ఉన్నామని, ఇతర క్రీడాకారులతో కలిసి బ్యాడ్జ్‌లను ధరించడం ఆనందంగా ఉందని తహ్లియా మెక్‌గ్రాత్ తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో తహ్లియా అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసింది.