శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:00 IST)

మలుపులు తిరుగుతున్న మోతేరా టెస్ట్ : 145 రన్స్‌కు భారత్ ఆలౌట్

అహ్మదాబాద్‌లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నిగ్స్‌‍లో భారత్ కూడా 145 రన్స్‌కు చాపచుట్టేసింది. దీంతో భారత్‌కు కీలకమైన 33 పరుగుల ఆధిక్యం మాత్రం దక్కింది. 
 
నిజానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధిస్తుందని భావించినా, రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం విశేషంగా నిలిచింది.
 
రూట్ 6.2 ఓవర్లు విసిరి 8 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో మూడు మెయిడెన్లు ఉన్నాయి. పార్ట్ టైమ్ బౌలర్‌ గా సేవలందించే రూట్... స్పిన్‌కు విశేషంగా సహకరిస్తున్న పిచ్‌పై ప్రధాన బౌలర్లను మించిపోయి బౌలింగ్ చేశాడు. 
 
రూట్ బంతులను ఎదుర్కొనేందుకు టీమిండియా లోయర్ ఆర్డర్ ఆపసోపాలు పడింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఒక్కరే గరిష్టంగా 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత కోహ్లీ 27 పరుగులు చేయగా, అశ్విన్ 17 పరుగులు సాధించాడు. 
 
ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ్టి ఆటలో భారత్ పతనాన్ని ప్రారంభించింది లీచ్ కాగా, రూట్ ముగింపు పలికాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆండర్సన్, బ్రాడ్, ఆర్చర్ రూపంలో ముగ్గురు పేసర్లను తీసుకోగా, వారు నామమాత్రంగా మిగిలారు. ఆర్చర్ మాత్రం ఒక్క వికెట్ తీశాడు. మిగతా 9 వికెట్లను రూట్, లీచ్ పంచుకున్నారు.
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఈ రెండు వికెట్లను పడగొట్టాడు.