మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:40 IST)

ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు పెంచుతారట.. కానీ చేతికి అందదట!

ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది భారత సంస్థలు ఉద్యోగుల జీతాలు పెంచబోతున్నాయి. సగటున 7.7 శాతం చొప్పున వేతనాలు పెరుగుతాయని ఎఆన్ సర్వేలో తేలింది. పనితీరు మెరుగ్గా ఉన్న వారి వేతనాలు 1.6 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. 2020లో కంపెనీలు చెల్లించిన వేతనాల కంటే సగటున ఇది 6.4 శాతం అధికం కావడం గమనార్హం. 
 
ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో భారత్‌లోనే ఉద్యోగుల వేతనాల పెంపు మెరుగ్గా ఉండనుండటం విశేషం. ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్ సంస్థలు 10.1 శాతం ఇంక్రిమెంట్లు ఇస్తాయని.. తర్వాత టెక్నాలజీ రంగ సంస్థలు 9.7 శాతం చొప్పున జీతాలు పెంచుతాయని.. ఐటీఈఎస్ కంపెనీలు 8.8 శాతం, ఎంటర్‌టైన్మెంట్ అండడ్ గేమింగ్ కంపెనీలు 8.1 శాతం, ఫార్మా సంస్థలు 8 శాతం చొప్పున ఈ ఏడాది వేతనాలు పెంచే అవకాశం ఉంది. ఆర్థిక సంస్థలు 6.5 శాతం చొప్పున, ప్రొఫెషనల్ సర్వీసెస్ 7.9 శాతం చొప్పున వేతనాలు పెంచే అవకాశం ఉందని అంచనా. 
 
దేశంలోని 1200కుపైగా కార్పొరేట్ సంస్థలు, 38 పరిశ్రమల నుంచి ఈ సర్వే వివరాలను సేకరించింది. కరోనా లాక్‌డౌన్ ప్రభావం నుంచి కోలుకోవడానికి ఆతిథ్యం, మౌలిక వసతులు, రిటైల్, ఇంజినీరింగ్ సర్వీసులు లాంటి రంగాలు ఇంకా ఇబ్బందులు పడుతున్నాయని ఈ సర్వే గుర్తించింది. 
 
ఈ రంగాల సంస్థలు 5.5 శాతం నుంచి 5.8 శాతం మధ్య జీతాలు పెంచే అవకాశం ఉంది. వేతనాలు పెరిగినా.. ఉద్యోగుల చేతికి అదే స్థాయిలో పెరిగిన జీతం అందకపోవచ్చు. కొన్ని సంస్థలు ప్రావిడెంట్ ఫండ్ పెంచే అవకాశం ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.