శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (12:20 IST)

రోహిత్ ది hero: రెండో టీ20లో భారత్ గెలుపు.. ప్రపంచ రికార్డు

rohith sharma
నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా హిట్ మ్యాన్ చెలరేగాడు. ఫలితంగా రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించి సిరీస్‌ను 1-1గా సమం చేసింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత జట్టు 91 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో సిరీస్ ఫలితం హైదరాబాద్ మ్యాచ్‌కు బదిలీ అయింది.
 
పరుగులు రాబట్టడంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న స్కిప్పర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 20 బంతుల్లో  నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలతో విరుచుకుపడ్డాడు. క్రీజులో పాతుకుపోవాలని, ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బ్యాట్‌ను ఝళిపించడం మానుకోవాలని సూచించాడు. అలాగే, ఫీల్డింగ్ వైఫల్యాలు సరిదిద్దుకోవాలని సూచించాడు.
 
గత రాత్రి మ్యాచ్ అనంతరం అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. నాగ్‌పూర్ మ్యాచ్‌లో రోహిత్ చాలా సెలక్టివ్‌ షాట్లు ఆడాడని ప్రశంసించాడు. ఫ్లిక్‌షాట్లు, పుల్‌షాట్లను అద్భుతంగా ఆడాడని అన్నాడు. రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఇదే కారణమని విశ్లేషించాడు. 
 
ఇకపోతే.. రోహిత్ వీరవిహారంతో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగుల (8 ఓవర్లలోనే) లక్ష్యాన్ని టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సిక్సర్ల విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.