1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (16:42 IST)

ఒక యేడాదిలో వెయ్యి పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్!

surya kumar
భారత బ్యాటర్ సూర్యకుమర్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే యేడాదిలో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా పాకిస్థాన్ బ్యాటర్ రిజ్వాన్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్ విన్యాసాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోతున్నారు. 
 
తాజాగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ కళ్లు చెదిరే షాట్లతో మెరుపు అర్థ శతకం సాధించి భారత్‌కు ఘన విజయం కట్టబెట్టాడు. ఇప్పటికే టీ20 ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ తాజా ప్రదర్శనంతో మరోమారు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 
 
ఈ యేడాది టీ20 ఫార్మెట్‌లో సూర్య వెయ్యి పరుగులు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు చేసిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ మొదటి స్థానంలో నిలిచాడు.
 
ఈ యేడాది ఇప్పటివరకు ఆడిన 28 టీ20 మ్యాచ్‌లలో సూర్య కుమార్ యాదవ్ 44.60 సగటుతో 1026 పరుగులు చేశాడు. 2021లో పాకి ఓపెనర్ రిజ్వాన్ 73.66 సగటుతో 1326 పరుగులు చేశాడు. రిజ్వాన్ 1326 పరుగులు చేసేందుకు 983 బంతులు తీసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మాత్రం 550 బంతుల్లో 1026 పరుగులు చేయడం గమనార్హం.