1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

రాజాంలో ఉపాధ్యాయుడిని కొట్టి చంపేసిన దుండగులు...

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన టీడీపీ మద్దతుదారుడు కావడమే ఈ హత్యకు కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడి పేరు ఏగిరెడ్డి కృష్ణ (58). బోలెరో వాహనంతో ఢీకొట్టించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. శనివారం ఉదయం ఇంటి నుంచి కృష్ణ తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళుతున్నారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద ప్రత్యర్థి వర్గం బోలెరో వాహనంతో ఆయన్ను ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయిన కృష్ణపై దాడి చేసి చంపేశారు. చనిపోయేముందు కళ్లలో కారం కొట్టి అక్కడ నుంచి పారిపోయారు. మృతదేహం భయానక స్థితిలో ఉంది. దీంతో కృష్ణది హత్యేనని ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆరోపిస్తూ, హత్యా స్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. 
 
దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, కృష్ణను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తేలింది. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉద్దవోలుకు మరడాన వెంకట నాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడు గతంలో టీడీపీ తరపున గ్రామ సర్పించిగా కూడా పనిచేశారు.