ఆస్తి కోసం అంత్యక్రియలను ఆపేసారు.. ససేమిరా అంటున్న తల్లి, సోదరి.. రోదిస్తున్న భార్య
ఆస్తి కోసం ఓ వ్యక్తి అంత్యక్రియలను కన్నతల్లి, సోదరి ఆపేశారు. దీంతో గత రెండు రోజులుగా ఆ వ్యక్తి మృతదేహం ఇంటివద్దే ఉంటుంది. భర్త శవాన్ని చూసిన భార్య రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది.
గిద్దలూరు పట్టణానికి చెందిన హయగ్రీవ శివాచారి (32) కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో భార్య, 3 సంవత్సరాల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన శివాచారి ఈ నెల 7న ఇంటిపై నుంచి కిందపడి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
భర్త మృతదేహాన్ని తీసుకొని 8వ తేదీన ఈశ్వరి గిద్దలూరులోని అత్తింటికి వచ్చింది. శనివారం వైశ్యాబ్యాంక్ వీధిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ శివాచారి తల్లి, సోదరి తమ ఇంటి వద్ద శవాన్ని పెట్టవద్దంటూ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. బంధువులు కూడా ఆ ప్రాంతానికి రాలేదు.
దీంతో ఆదివారం సాయంత్రం వరకు శవం వద్ద ఈశ్వరి రోదిస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రం సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్ సీఐ సురేశ్ అక్కడికి చేరుకొని శివాచారి తల్లి, సోదరి, భార్యతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. అయితే ఆస్తుల విషయం తేలే వరకు అంత్యక్రియలు చేయబోమని వారు తేల్చిచెప్పారు.