1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (20:41 IST)

నారా లోకేష్ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకునే త్యాగమూర్తికి మంత్రి పదవి...?!

అధినేత కుమారుడి కోసం తన ఎమ్మెల్యే పదవినే ఇచ్చేయడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తికి మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం సిద్థమైంది. రాజువయ్యా... మహరాజువయ్యా.. అంటూ అందరి చేత శహబాష్‌ అనిపించుకున్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఎట్టకేలకు మంత్రి ప

అధినేత కుమారుడి కోసం తన ఎమ్మెల్యే పదవినే ఇచ్చేయడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తికి మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం సిద్థమైంది. రాజువయ్యా... మహరాజువయ్యా.. అంటూ అందరి చేత శహబాష్‌ అనిపించుకున్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఎట్టకేలకు మంత్రి పదవి దాదాపు ఖరారైంది. మంత్రి పదవి వస్తుందని కలలోనైనా ఊహించని అమరనాథ రెడ్డికి ఆ పదవి వస్తుండటంతో ఆయనకన్నా ఆయన సన్నిహితుల ఆనందానికి అవధుల్లేవు.
 
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉండడమే కాకుండా చంద్రబాబు, నారా లోకేష్‌లతో మంచి రాపో ఉన్న పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సీనియర్ల మీద ఉన్న కోపంతో ఒక్కసారిగా పార్టీ మారారు. ఎన్నికల సమయంలో వైకాపాలోకి వెళ్ళిన అమరనాథ రెడ్డి ప్రజాప్రతినిధిగా గెలిచారు. ఆ తరువాత వైకాపాలో కొన్నిరోజుల పాటు ఉన్న అమరనాథ రెడ్డి ఆ పార్టీలోను ఆటుపోట్లను ఎదుర్కోవడంతో ఇక చేసేది లేదు మళ్ళీ సొంత గూటికే వచ్చేశారు. అదే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లోకి రావడమే కాదు.. ఏకంగా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడానికి సిద్థమయ్యారు.
 
ఎందుకో తెలుసా.. అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌ కోసం. ఎపిలో ఎన్నో నియోజకవర్గాలను పెట్టుకుని పలమనేరునే ఎందుకు నారా లోకేష్‌ ఎంచుకున్నారనుకుంటున్నారా.. అందుకు ఒక కారణం ఉంది. పలమనేరు కుప్పంకు అతి సమీప ప్రాంతం. అమరనాథ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా గెలవగలిగే సత్తా ఉన్న వ్యక్తి. చిత్తూరు ఎంపి గెలవడానికి ఎక్కువగా దోహదపడే నియోజకవర్గం పలమనేరే. అందుకే నారా లోకేష్‌ సులువుగా గెలవడానికి పలమనేరు ఒకటే మార్గమని ఎంచుకున్నారు. అందుకే పలమనేరు నుంచి నారా లోకేష్‌ను పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
 
ఇది కూడా ఎవరో చెప్పటం కాదు. ఏకంగా అమరనాథరెడ్డ ఈ ఆఫర్ ఇచ్చారు. తన కుమారుడిని ఎక్కడ నిలబెట్టి గెలిపించుకోవాలో తెలియక ఆలోచనలో పడ్డ చంద్రబాబుకు అమరనాథరెడ్డే ఈ సలహా ఇచ్చారట. తనకు పదవి ముఖ్యం కాదని.. పార్టీ ముఖ్యమని చంద్రబాబు వద్ద వందకు వంద మార్కులే కొట్టేశారట. దీంతో ఆశ్చర్యపోయిన బాబు అమరనాథ రెడ్డి త్యాగానికి ఫలితంగా ఏకంగా మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధమైపోయారట. ఉన్న ఎమ్మెల్యే పదవి అలాగే ఉండటంతో పాటు అమరనాథ రెడ్డికి మంత్రి పదవి వస్తుండటంతో ఆయన అనుచరుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. అసలు మంత్రి పదవి కావాలని అమరనాథ రెడ్డే ఇప్పటివరకు ఊహించలేదంటే ఏ స్థాయిలో అధినేత వద్ద ఈయన మార్కులు కొట్టేశారో అర్థమవుతుంది. మొత్తంమీద రానున్న కేబినెట్ విస్తరణలో అమరనాథరెడ్డికి మంత్రి పదవి రావడం దాదాపు ఖాయమైంది.