వ్యక్తిగత సహాయకుడి ఇంటిలో బంగారం సీజ్ - కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ సన్యాసం
తన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన వ్యక్తి ఇంటిలో బంగారం, భారీ మొత్తంలో డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తన రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
హరీశ్ రావత్ వద్ద చందన్ సింగ్ జీనా అనే వ్యక్తి పీఏగా పని చేశారు. 2016లో ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ నియామక పరీక్షల్లో ఓఎంఆర్ షీట్లను మార్చి అక్రమాలకు పాల్పడినట్టు జీనాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసింది.
ఈ తనిఖీల్లో రూ.32 లక్షల నగదు, సుమారు 200 గ్రాముల బంగారు నాణేలు, ఆభరణాలు, 12 ఖరీదైన గడియారాలను జీనా నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. జీనా, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోని రూ.52.16 లక్షలను స్తంభింపజేసింది.
అయితే.. జీనాపై వచ్చిన ఆరోపణలను తాను నమ్మడం లేదని.. అతను బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి అని రావత్ చెప్పారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీనా ఓఎస్డీగా పనిచేశారు. ఆ తర్వాత పీఏగా కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పరిణామం ఎలా ప్రభావం చూపుతోందో చూడాల్సి ఉంది.

