శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (20:17 IST)

డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన షెడ్యూల్ ఇదే...

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ పర్యటనకు రానున్నారు. ఆయన వెంట ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా వీరిద్దరూ ప్రేమ సౌథం తాజ్ మహల్‌ సౌందర్యాన్ని కూడా వీక్షిస్తారు. 
 
ఈ పర్యటనలో మొదటి రోజైన సోమవారం ఆయన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో 'నమస్తే ట్రంప్' అనే భారీ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారు. ఇటీవలే నిర్మితమైన ఈ క్రికెట్ స్టేడియం సామర్థ్యం లక్ష మంది కావడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం. 
 
ఆ తర్వాత సోమవారం సాయం సంధ్య వేళలో డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రా వెళ్తారు. అక్కడి ప్రేమ సౌథం తాజ్ మహల్‌ అందాలను ఆస్వాదిస్తారు. ఈ ప్రేమ సౌథం వద్ద ఆత్మీయానురాగాలను పంచుకోవాలనే అభిలాష చాలా మందికి ఉంటుంది. అదేవిధంగా విదేశీ ప్రతినిథులు కూడా చాలా మంది ఇక్కడ ఫొటోలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.
 
మంగళవారం ఉదయం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే స్వాగత కార్యక్రమానికి ట్రంప్ దంపతులు హాజరవుతారు. రాష్ట్రపతి భవన్‌లోని రాజ ప్రాసాదంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారక కేంద్రాన్ని సందర్శించి, ఆయనకు నివాళులర్పిస్తారు. 
 
ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో మధ్యాహ్నం విందుకు హాజరవుతారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సమావేశాలు కూడా ఇక్కడే జరుగుతాయి. అనంతరం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీలు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. 
 
మంగళవారం మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం ఆతిథ్యమిచ్చే విందులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉంది. పిమ్మట ఆయన స్వదేశానికి తిరిగివెళతారు.