1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:42 IST)

ఓ తల్లి విషాధ గాధ... కన్నబిడ్డ కోసం 39 యేళ్లుగా ఎదురు చూపులు

భారతీయ మహిళ కువైట్ జాతీయుడిని వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమె భర్త ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆమె స్వదేశానికి రావాలని నిర్ణయించుకుంది. కానీ, కువైట్ చట్టాల ప్రకారం ఆమె బిడ్డను అక్కడే వదిలివేసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కన్నబిడ్డ కోసం గత 39 యేళ్లుగా ఆ తల్లి ఎదురు చూస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ చాంద్రయణగుట్టకు చెందిన ఫాతిమా బేగం 1978లో కువైట్ జాతీయుడైన మహ్మద్ హిజాబ్‌ అలాజ్మీని హైదరాబాద్‌లో వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ కువైట్ వెళ్లిపోయారు. భార్య గర్భంతో ఉన్నప్పుడు అతడు ఆమెను భారత్‌కు పంపించాడు. 1979లో  సలేహ్ అనే ఆడబిడ్డకు ఫాతిమా జన్మనిచ్చింది. తర్వాత వచ్చి తీసుకువెళతానని చెప్పిన భర్త ఎంతకూ రాలేదు. ఉత్తరాలు రాసినా జవాబు లేదు. దీంతో ఆందోళనకుగురైన ఆమె కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఓ లేఖ రాసింది. 
 
దీనిపై స్పందించిన భారత ఎంబసీ అధికారులు.. అలాజ్మీ సౌదీ అరేబియాలోని దమమ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అలాజ్మీ చనిపోయినట్టు సమాచారమిచ్చారు. ఆ తర్వాత అలాజ్మీ మొదటి భార్య కుమారుడు 1980లో భారత్‌కు వచ్చి ఫాతిమాను, సలేహ్‌ను కువైట్ తీసుకెళ్లాడు. అప్పటికి సలేహ్ వయసు ఏడాది మాత్రమే. కువైట్ వెళ్లిన ఫాతిమా పరిస్థితి దయనీయంగా మారింది. భర్త చనిపోయాక వచ్చే ప్రయోజనాలన్నీ మొదటి భార్యకే చెందాయి. కువైట్‌లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు స్వదేశానికి రాలేక పోయింది. 
 
దీంతో మానసికంగా కుంగిపోయిన ఫాతిమా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనతో ఆందోళన చెందిన అలాజ్మీ మొదటి భార్య కుమారుడు ఆమెను ఇండియాకు తీసుకొచ్చి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ, కుమార్తె సలేహ్ మాత్రం అక్కడే ఉండిపోయింది. 1987లో కూతురి కోసం మరోసారి కువైట్ వెళ్లింది. ఎంత వెతికినా ఆచూకీ తేలలేదు. అదేసమయంలో అక్కడే స్థిరపడి భారతీయుడ్ని వివాహం చేసుకుంది. 1991 కువైట్-ఇరాక్ యుద్ధ సమయంలో తిరిగి భారత్‌కు చేరుకుంది. 
 
హైదరాబాద్‌లో నివాసముంటూ అప్పటి నుండి కూతురి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరో ప్రయత్నంగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వీడియోని షేర్ చేసింది. అందులో తాను చనిపోకముందే తన కూతురిని చూడాలనుకుంటున్నాను అని తెలిపింది. కూతురి ఆనవాళ్లు తెలిపే వివరాలను కూడా పొందుపరిచింది. 39 సంవత్సరాలుగా కూతురి కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపింది. సోమవారం (ఫిబ్రవరి 25) కువైట్‌లోని ఇండియన్ ఎంబస్సీని కూడా సంప్రదించింది. ఆవసరమైన డాక్యుమెంట్‌లను పంపింది. వాటిని సామాజికవేత్త అమ్జత్ ఉల్లాఖాన్ ద్వారా స్వీకరించినట్లు ఇండియన్ ఎంబస్సీ ధృవీకరించింది.