1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (08:21 IST)

వరుస భూకంపాలతో వణికిపోయిన ఇండోనేషియా - సింగపూర్

వరుస భూకంపాలతో ఆసియా దేశాలైన ఇండోనేషియా, సింగపూర్ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. తొలుత ఇండోనేషియాలోని ఉత్తర సెమరాంగ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.6గా నమోదైంది. 
 
జావా ద్వీపంలోని బాటాంగ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమైనట్టు తెలుస్తోంది.
 
అలాగే, ఆగ్నేయ సింగపూర్‌లోనూ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. 
 
మరోవైపు, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోనూ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత భూమి స్వల్పంగా కంపించింది. సుమారు ఒంటి గంట ప్రాంతంలో తవాంగ్ సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. 
 
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.
 
అయితే, ఇండోనేషియా దేశ ప్రధాన ద్వీపం అయిన జావా తీరంలోని సముద్రగర్భంలో సంభవించిన భూకంపం సముద్ర గర్భంలో 528 కిలోమీటర్ల లోతులో కేంద్రీకతమై ఉందని ఇండోనేషియా వాతావరణ, జియోఫిజిక్స్ అధికారులు చెప్పారు. 
 
ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. సెంట్రల్ జావా ప్రావిన్సులోని తీర ప్రాంత పట్టణమైన బటాంగ్ కు ఉత్తరాన సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
2004లో హిందూమహా సముద్రంలో సంభవించిన భూకంపం, అగ్నిపర్వత విస్పోటనం వల్ల సునామీ రావడంతో 12 దేశాల్లో 2,30,000 మంది మరణించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 1.33 గంటలకు భూమి కంపించింది.తరచూ ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి.