గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (10:15 IST)

టర్కీ - సిరియాల్లో మృత్యువిలయం - 15 వేలు దాటిన మరణాలు

turkey earthquake
ఇటీవల వరుస భూకంపాలకు గురైన టర్కీ, సిరియా దేశాల్లో మత్యువిలయం సంభవించింది. ఎటు చూసినా శవాలే కనిపిస్తున్నాయి. భూకంపం ధాటికి బహుళ అంతస్తు భవనాలు కుప్పకూలిపోగా ఆ శిథఇలాల కింద శవాలు కనిపిస్తున్నాయి. వీటిని తొలగించే పనుల్లో సహాయక బృందాలు నిమగ్నమైవున్నాయి. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 15 మంది చనిపోగా, అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 25 వేలకు మందికిపైగా చనిపోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ భూకంపంవల్ల గాయపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. నిజానికి ఈ వరుస భూకంపాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 25 వేలకు పైగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య దాదాపు 25 వేలకుపైగానే ఉంది. శిథిలాలను తొలగించేకొద్దీ శవాల గుట్టలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా ఈ భూకంప మృతులు 25 వేలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
 
ముఖ్యంగా, భూప్రళయం అనంతరం విపత్కర పరిస్థితులతో టర్కీ, సిరియా దేశాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎక్కడ చూసిన హృదయ విదాకర పరిస్థితులు నెలకొనివున్నాయి. శిథిలాల కింద చిక్కుకునివున్న చిన్నారులను కొన ఊపిరితో ఉండగా కాపాడుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. తాగేందుకు గుక్కెడు నీరు లేక అలమటించి పోతున్నారు. భూకంపాల ధాటికి గృహాలు కోల్పోయిన ఈ రెండు దేశాల ప్రజలు నిలువ నీడలేక నరకయాతన అనుభవిస్తున్నారు. గత మూడు రోజులుగా తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక విలవిలలాడిపోతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రేయింబవుళ్లు పని చేస్తూనే ఉన్నాయి. 
 
మరోవైపు, టర్కీతో పాటు సిరియాకు కూడా సాయం అందించేందుకు భారత్ 'ఆపరేషన్ దోస్త్' పేరుతో సహాయక చర్యలను ప్రారంభించిన విషయం తెల్సిందే. భారత్‌ నుంచి రెండు వాయుసేన విమానాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ ఆపరేషన్స్‌ కోసం ట్రైనింగ్‌ పొందిన డాగ్‌ స్క్వాడ్ టర్కీకి తరలివెళ్లాయి. ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 
 
బుధవారం కూడా హిండన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సహాయసామగ్రి, బృందాలతో భూకంప బాధిత ప్రాంతాలకు బయలుదేరింది. రేషన్‌, మెడిసిన్‌తో పాటు 51మంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌.. భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టనుంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్ చేశారు. భూకంపం బాధితులకు సాయం అందించడానికి ఆరో ఫైట్ భారత్ నుంచి వెళ్లినట్లు పేర్కొన్నారు. మరిన్ని సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు, అవసరమైన పరికరాలు, మందులు, సహాయక సమాగ్రిని పంపించినట్లు ఆయన వెల్లడించారు.