యుఎస్ యుద్ధ నౌకపై యెమెన్ దాడులు.. ఆత్మరక్షణ కోసం అమెరికా క్షిపణి స్ట్రైక్స్
యెమెన్పై అమెరికా యుద్ధం ప్రారంభించింది. యెమెన్ దేశానికి చెందిన రాడార్ నిర్వహణ స్థలాలే లక్ష్యంగా అమెరికా ఆర్మీ మిస్సైల్ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో మూడు రాడార్ నిర్వహణ కేంద్రాలు ధ్వంసమైనట్టు అమెరికా
యెమెన్పై అమెరికా యుద్ధం ప్రారంభించింది. యెమెన్ దేశానికి చెందిన రాడార్ నిర్వహణ స్థలాలే లక్ష్యంగా అమెరికా ఆర్మీ మిస్సైల్ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో మూడు రాడార్ నిర్వహణ కేంద్రాలు ధ్వంసమైనట్టు అమెరికా స్వయంగా వెల్లడించింది. కేవలం ఆత్మరక్షణ కోసమే ఈ దాడి చేపట్టినట్టు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.
అయితే, దాడులకు పురికొల్పింది మాత్రం యెమెన్ అని అమెరికా చెపుతోంది. గత ఆదివారం రాత్రి ఎర్ర సముద్రంలో లంగరు వేసివున్న అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ మాసన్పై యెమెన్ క్షిపణి దాడులు చేసింది. ఈ క్షిపణలు నౌకకు తాకకుండానే నీళ్ళలో పడిపోయాయి. అలాగే బుధవారం కూడా మరోసారి యుద్ధ నౌకపై క్షిపణి దాడి జరిగిందని అందుకే తాము ఆత్మ రక్షణ నిమిత్తం యెమెన్పై దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది.
ఇదిలావుండగా, యెమెన్ రాజధాని సానా సహా మైనారిటీ షియా హౌథీ నియంత్రణలోని భూభాగంపై యూఎస్ఎస్ మాసన్ బుధవారం దాడులు జరిపినట్లు వెల్లడించింది. నిజానికి అమెరికా యుద్ధ నౌకలు ఎర్ర సముద్రంలో ఎన్నో ఏళ్ళుగా తిష్ట వేసి ఉంటుండటం సాధారణమే. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఆ నౌకలను యెమెన్ ఎందుకు టార్గెట్ చేస్తుందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సంవత్సరకాలం పైనుంచే సౌదీ అరేబియా నుంచి యెమెన్ వినాశకర యుద్ధాన్నిఎదుర్కొంటోంది.