1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (11:11 IST)

ధోనీ అదుర్స్ 0,6,0,4,4,4 బ్యాటింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై ఫ్యాన్ (వీడియో)

Dhoni
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో మ్యాచును ఫినిష్ చేస్తాడు. అందుకే మహీ బెస్ట్ ఫినిషర్‌గా పేరుగాంచాడు. అయితే ధోనీ గతకొంతకాలంగా ఫినిషర్‌ పాత్రను సరిగ్గా పోషించడం లేదు. 
 
అయితే ఎట్టకేలకి మహీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తనలోని ఫినిషర్‌ ఇంకా ఉన్నాడని మరోసారి నిరూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో మహీ సత్తాచాటాడు
 
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటి వరకూ ఛేదనలో చెన్నైకి అండగా నిలిచిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (70: 50 బంతుల్లో 5x4, 2x6) ఔట్ అయ్యాడు. 
 
దాంతో మొయిన్ అలీ, అప్పుడే క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీపై భారం పడింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అవేష్ ఖాన్‌ బౌలింగ్‌లో ఓ అద్భుత సిక్స్‌తో మహీ పరుగుల ఖాతా తెరిచాడు. మహీ 84 మీటర్ల భారీ సిక్స్ బాదడంతో మైదానం హోరెత్తింది. 
 
అభిమానులతో పాటు ధోనీ సతీమణి సాక్షి కూడా ఆనందంలో గంతులేశారు. అదే ఓవర్‌లో అలీ కూడా ఓ ఫోర్ కొట్టడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దాంతో చెన్నై గెలుపు సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది.
 
చివరి ఓవర్‌లో టామ్ కరన్ బౌలింగ్‌కి రాగా.. మొదటి బంతికే మొయిన్ అలీ (16: 12 బంతుల్లో 2x4) ఔట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. ఎంఎస్ ధోనీ ఉన్నా.. ఫామ్‌లో లేనికారణంగా అతడిపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఇక్కడే మహీ మాయ చేశాడు. 
 
ఒత్తిడిలోనూ మ్యాచ్‌లను ఎలా ఫినిష్ చేయాలో తెలిసిన ధోనీ.. వరుసగా రెండు, మూడు బంతులను బౌండరీకి తరలించేశాడు. దాంతో ఒత్తిడిలో తాం ఓ వైడ్ కూడా వేశాడు. నాలుగో బంతికి మహీ ఇంకో ఫోర్ బాదడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌లో చెన్నై ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారికాగా.. ఇప్పటికే ఆ జట్టు మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.
 
ఎంఎస్ ధోనీ 6 బంతుల్లో 13 పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. మహీ బౌండరీ బాదినప్పుడల్లా మైదానం అరుపులు, కేరింతలతో హోరెత్తింది. కొందరు ఫాన్స్ ఆనందంలో మైదానంలోనే డాన్సులు చేశారు. 
 
ధోనీ విన్నింగ్స్ షాట్ కొట్టగానే.. చెన్నై అభిమానులు కొందరు ఏడ్చేశారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉండడం విశేషం. గతేడాది ప్లే ఆఫ్ చేరకుండా నిష్క్రమించడంతో నిరాశ చేందిన ఫాన్స్.. ఈసారి ఫైనల్లో అడుగుపెట్టడంతో భావోద్వేగానికి గురయ్యారు. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా ఏడ్చేశారు. దీనికి సంబందించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ అనంతరం ధోనీ తన విన్నింగ్ బాల్‌ను ఓ చిన్నారికి బహుమతిగా ఇచ్చాడు