1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (07:24 IST)

ఐపీఎల్ 14: ఫైనల్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 14వ సీజన్‌ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మూడుసార్లు టైటిల్ విజేత అయిన చెన్నై తాజాగా తొమ్మిదోసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీ కేపిటల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-1లో ఢిల్లీని ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ మునపటి ఆటతీరు కనబరిచాడు. 6 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు 172 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ఓపెనర్ పృథ్వీషా, కెప్టెన్ పంత్‌తోపాటు చివరల్లో హెట్‌మెయిర్ చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. 
 
పృథ్వీషా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా, పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. హెట్‌మెయిర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది.
 
ఆ తర్వాత 173 రన్స్‌ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మూడు పరుగుల వద్దే డుప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకుంది. 
 
రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ కలిసి బౌలర్లపై విరుచుకుపడ్డారు. యథేచ్ఛగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గైక్వాడ్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, ఉతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. 
 
ఇక చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 13 పరుగులు అవసరమైన వేళ మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. దీనికితోడు ఓవర్ తొలి బంతికే మొయిన్ అలీ (16) వికెట్ కోల్పోయింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ మరింత పెరిగింది. 
 
అయితే, ధోనీ మునుపటి ఫినిషర్‌ను తలపించి హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్‌కు చేర్చాడు.
 
ఈ సీజన్‌లో తొలి నుంచి అద్భుతంగా ఆడుతూ వస్తున్న ఢిల్లీ కీలక మ్యాచ్‌లో చతికిలపడటం గమనార్హం. అలాగే, 70 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 
 
ఐపీఎల్‌లో నేడు బెంగళూరు రాయల్ చాలెంజర్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.