1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (08:54 IST)

ధోనీ సేన ఓటమి : అగ్రస్థానంలో ఢిల్లీ

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 13 మ్యాచుల్లో తలపడిన ఢిల్లీకి ఇది పదో విజయం కాగా, చెన్నైకి ఇది నాలుగో ఓటమి.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రాయుడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. 43 బంతులు ఎదుర్కొన్న రాయుడు 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో అక్సర్ పటేల్ 2, నార్జే, అవేశ్ ఖాన్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 137 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు తడబడటంతో మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగింది. చివరికి మరో రెండు బంతులు మిగిలి ఉండగా ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ 39, షిమ్రన్ హెట్మెయిర్ 28 (నాటౌట్), పృథ్వీషా 18, రిపల్ పటేల్ 18, రిషభ్ పంత్ 15 పరుగులు చేశారు.
 
చివరి నాలుగు బంతుల్లో విజయానికి రెండు పరుగులు అవసరమైన వేళ అక్సర్ పటేల్ (5) అవుట్ కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కగిసో రబడ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయభేరీ మోగించింది. 
 
ఇకపోతే, చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, హేజిల్‌వుడ్, బ్రావో చెరో వికెట్ తీసుకున్నారు. అక్సర్ పటేల్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.